ఇడ్లీ, దోశ నుంచి వడాపావ్ వరకు. మన వంటకాల రుచికి ఫారెనర్ ఫిదా
భారతీయ సాంప్రదాయ వంటకాలు, ఇక్కడి వైవిధ్యభరితమైన రుచులు ప్రపంచదేశాల ప్రజలను నిరంతరం ఆకట్టుకుంటూనే ఉంటాయి. తాజాగా బ్రిటన్కు చెందిన ప్రముఖ ప్రముఖ ఫుడ్ కంటెంట్ క్రియేటర్, యూట్యూబర్ జూలియస్ ఫీడ్లర్ (Julius Fiedler) భారత ఆహార సంస్కృతిని, ఇక్కడి శాఖాహార వంటకాలను ఆకాశానికెత్తేశారు. కొద్దివారాల పాటు భారతదేశంలో పర్యటించిన ఆయన.. మనదేశంలో "వీగన్" వంటకాలు ఎంత సులభంగా దొరుకుతాయో చూసి తీవ్ర ఆశ్చర్యానికి గురయ్యారు. ఇతర విదేశాల్లో వీగన్ ఆహారం కోసం పడే శ్రమతో పోలిస్తే, భారతదేశంలో ఏ రసాయనాలు, మార్పులు లేకుండా సహజంగా లభించే వంటకాలే అత్యంత రుచికరమైన వీగన్ ఆహారంగా అందుబాటులో ఉన్నాయని ఆయన ప్రశంసల వర్షం కురిపించారు.
మన నిత్య జీవిత వంటకాలే.. వారి దృష్టిలో అమృత తుల్యాలు!
తన పర్యటన విశేషాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ జూలియస్ ఫీడ్లర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "భారతదేశంలో నేను శాకాహారం కోసం అస్సలు వెతకాల్సిన అవసరమే రాలేదు. మనం రోజూ తినే పప్పు (దాల్), దోశ, ఇడ్లీ, సాంబార్లతో పాటు రకరకాల వీధి వంటకాలు (స్ట్రీట్ ఫుడ్) సహజంగానే ఎటువంటి మాంసం, పాలు లేదా నెయ్యి వాడకుండా తయారవుతాయి" అని ఆయన పేర్కొన్నారు. హిందూ మతం, బౌద్ధం, జైన మతాల ప్రభావం వల్ల భారతదేశంలో ప్రాచీన కాలం నుంచే శాకాహారానికి విశేషమైన ప్రాధాన్యత ఉందని, దక్షిణ భారతదేశపు వాతావరణం వల్ల లభించే కొబ్బరిని పాడి ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంగా చాలా వంటకాల్లో వాడటం ఎంతో అద్భుతంగా ఉందని కొనియాడారు.

దక్షిణాది సద్య నుంచి ముంబై వడపావ్ వరకు.. అన్నీ రుచుల విందులు!
దక్షిణాది పండుగలు, శుభకార్యాల్లో వడ్డించే సాంప్రదాయ' విందును ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. సుమారు 40 రకాల వంటకాలతో అరటి ఆకులో వడ్డించే ఈ సద్యలోని మెజారిటీ వంటకాలు వీగన్ పద్ధతిలోనే ఉండటం విశేషమని అన్నారు. బియ్యం, మినపప్పులతో పులియబెట్టి తయారుచేసే మెత్తటి ఇడ్లీలు, క్రిస్పీ వడలు, మసాలా దోశలు, కొబ్బరి చట్నీల కాంబినేషన్కు ఆయన ఫిదా అయ్యారు. వీటితో పాటు రాగి ముద్ద, మహారాష్ట్ర మిసల్ పావ్, రకరకాల చాట్లు, ముంబైకి చెందిన ప్రసిద్ధ వడపావ్, పానీపూరీలను ఆయన రుచి చూసి, "రుచుల బాంబ్" అంటూ అభివర్ణించారు.
సోషల్ మీడియాలో ప్రశంసల వెల్లువ
జూలియస్ షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ పోస్ట్పై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. "మా దేశంలో ప్రత్యేకంగా 'వీగన్' అనే ట్యాగ్ అవసరం లేకుండానే వందల ఏళ్ల నుంచి ఈ రకమైన ఆహార సంస్కృతి నిలకడగా సాగుతోంది" అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా.. మరికొందరు భారత్ను సందర్శించి ఇక్కడి ఆహార గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిచెప్పినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. భారతీయ ఆహార వైవిధ్యం, రుచులు ఎంతటి విదేశీయుడినైనా తన ప్రేమలో పడేస్తాయనడానికి ఈ సంఘటనే ప్రత్యక్ష నిదర్శనం.














Click it and Unblock the Notifications
