Swatantra Bhardwaj: పాడ్కాస్ట్లో బిల్డప్.. కట్ చేస్తే కటకటాలు! ఎవరీ స్వతంత్ర భరద్వాజ్?
రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రెండున్నర నెలల క్రితం జరిగిన ఒక చిన్నపాటి ఘర్షణ.. ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర రాజకీయ సంచలనానికి దారితీసింది. సోషల్ మీడియాలో 'హిందూత్వ యాక్టివిస్ట్', 'ఇన్ఫ్లుయెన్సర్' అని చెప్పుకునే 21 ఏళ్ల స్వతంత్ర భరద్వాజ్ అనే యువకుడు చేసిన అత్యుత్సాహం, విర్రవీగుతూ ఇచ్చిన ఇంటర్వ్యూలు అతడినే చిక్కుల్లో పడేశాయి.
ఓ ప్రైవేట్ పాడ్ కాస్ట్లో మాట్లాడుతూ ఒక వ్యక్తి తల పగలగొట్టానని, తన రాజకీయ పరిచయాల వల్ల హత్యాయత్నం కేసు పడకుండా బయటపడ్డానని బిల్డప్ ఇవ్వడం తీవ్ర వివాదాస్పదమైంది. ఈ ఉదంతం రాజకీయ రంగు పులుముకోవడంతో పాటు, ప్రతిపక్షాల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమైంది. చివరికి ఢిల్లీ పోలీసులు అతడిని ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షహర్లో అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో విర్రవీగుడు.. వివాదానికి అసలు బీజం!
బీహార్లోని పాట్నాకు చెందిన స్వతంత్ర భరద్వాజ్కు సోషల్ మీడియాలో దాదాపు 1.8 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. జూన్ 23న జంతర్ మంతర్ వద్ద విపక్షాలు, విద్యార్థి సంఘాలు చేపట్టిన నిరసన వేదిక వద్దకు వెళ్లిన భరద్వాజ్.. అక్కడ ఒక మైనర్ బాలిక తండ్రితో గొడవపడి తన చేతికి ఉన్న కడియంతో అతడి తలపై కొట్టాడు. అయితే ఇటీవల ఒక యూట్యూబ్ పాడ్ కాస్ట్లో పాల్గొన్న భరద్వాజ్, "నేను ఆ వ్యక్తి తల పగలగొట్టాను, అతడికి 60 కుట్లు పడ్డాయి. నాకు కేంద్ర మంత్రులు, రాజకీయ దిగ్గజాల అభయహస్తం ఉంది కాబట్టే పోలీసులు నన్ను అరెస్ట్ చేయలేకపోయారు" అని గొప్పలు చెప్పుకున్నాడు. పైగా భవిష్యత్తులో అవసరమైతే కడాలే కాకుండా కట్టా (నాటు తుపాకీ) కూడా వాడతామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

పోలీసుల వేగవంతమైన కౌంటర్.. తలకు తగిలింది చిన్న గాయమే!
భరద్వాజ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగడంతో ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగి అసలు నిజాలను వెల్లడించారు. భరద్వాజ్ చెప్పేవన్నీ కట్టుకథలని, ప్రచార ఆర్భాటం కోసమే అలా అబద్ధాలు చెప్పాడని స్పష్టం చేశారు. జూన్ 23న జరిగిన ఘటన తర్వాత బాధితుడిని ఆర్ఎమ్ఎల్ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించగా, అది కేవలం చిన్నగాయమని వైద్యులు ధృవీకరించినట్లు తెలిపారు. భరద్వాజ్ దాడి చేసిన మాట నిజమే అయినా, బాధితుడి తల పగిలిపోలేదని, 60 కుట్లు పడలేదని మెడికల్ రిపోర్టులను ఉటంకిస్తూ వెల్లడించారు. చట్టపరమైన నిబంధనల ప్రకారమే అప్పట్లో ఇరువర్గాలకు నోటీసులు జారీ చేసి విడుదల చేశామని వివరణ ఇచ్చారు.
రాజకీయ రంగు పులుముకున్న దాడి.. రంగంలోకి భీమ్ ఆర్మీ, నేతలు!
పాడ్ కాస్ట్ వీడియో వైరల్ కావడంతో జూన్ ఘటన మళ్లీ ముదిరి పాకాన పడింది. కాక్రోచ్ జనతా పార్టీ, భీమ్ ఆర్మీ విభాగాలు ఢిల్లీ వీధుల్లో తీవ్ర నిరసనలకు దిగాయి. బాధితుడు దళిత వర్గానికి చెందినవాడని, అందుకే భరద్వాజ్పై పోలీసులు మృదు వైఖరి అవలంబిస్తున్నారంటూ ఎంపీ చంద్రశేఖర్ ఆజాద్, పూర్ణియా ఎంపీ పప్పు యాదవ్ తదితర నేతలు సంసద్ మార్గ్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. భరద్వాజ్పై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు హత్యాయత్నం సెక్షన్లు నమోదు చేయాలని, అతడి వెనుక ఉన్న రాజకీయ శక్తులపై విచారణ జరపాలని గట్టిగా డిమాండ్ చేశారు. నిరసనల ఉద్ధృతి పెరగడంతో పోలీసులు పాత కేసులో ఎస్సీ/ఎస్టీ సెక్షన్లను యాడ్ చేశారు.
మైనర్ బాలికపై ఆన్లైన్ వేధింపులు.. పోక్సో, ఐటీ యాక్ట్ కింద మరో FIR!
కేవలం దాడి ఘటన మాత్రమే కాకుండా స్వతంత్ర భరద్వాజ్ తీవ్రమైన ఆన్లైన్ వేధింపులకు కూడా పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. జంతర్ మంతర్ వద్ద ఉన్న మైనర్ బాలికను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో అత్యంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేయడం, రేప్ చేస్తానని వార్నింగ్ ఇవ్వడం, మార్ఫింగ్ ఫోటోలను షేర్ చేయడం వంటి పనులకు పాల్పడినట్లు బాలిక కుటుంబం ఫిర్యాదు చేసింది.
దీనిపై తీవ్రంగా స్పందించిన పోలీసులు భరద్వాజ్పై పోక్సో, ఐటీ చట్టం కింద మరో కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రాజకీయ లబ్ధి, సోషల్ మీడియా రీచ్ కోసం నోటికొచ్చినట్లు మాట్లాడి అల్లర్లు సృష్టించాలని చూసిన ఈ ఇన్ఫ్లుయెన్సర్.. ఇప్పుడు పోలీసుల కస్టడీలో ఉచలు లెక్కిస్తున్నాడు.














Click it and Unblock the Notifications