పాకిస్తాన్.. అష్టదిగ్బంధనం: లక్షల్లో రోడ్లపైకి జనం
పాకిస్తాన్.. ప్రస్తుతం తీవ్ర సవాళ్లు, ఆందోళనలను ఎదుర్కొంటోంది. ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన పెట్రోలియం లెవీ పన్నులు, విపరీతంగా పెరుగుతున్న నిత్యావసరాల ధరలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు పెల్లుబుకుతున్నాయి. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. అతివాద ఇస్లామిక్ పార్టీ జమాత్-ఎ-ఇస్లామీ పిలుపు మేరకు వేలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వస్తోన్నారు. పన్నుల భారానికి నిరసనగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇందులో భాగంగా నిరసనకారులు ఛక్కా జామ్ నిర్వహించారు. కరాచీ, లాహోర్, పెషావర్, క్వెట్టా, ఇస్లామాబాద్, రావల్పిండి, అబోటాబాద్ వంటి నగరాలను నిరసనకారులు చుట్టుముట్టారు. రోడ్లను దిగ్బంధించారు. దేశవ్యాప్తంగా ధర్నాలు, రహదారుల దిగ్బంధనాల వల్ల ప్రజల సాధారణ జీవనం స్తంభించిపోయింది. ఈ అదనపు పన్నుల భారం నుండి తక్షణమే ఉపశమనం కావాలంటూ నిరసనకారులు మండుటెండల్లో సైతం రోడ్డెక్కారు.

ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ సారథ్యంలోని అధికార పాకిస్తాన్ ముస్లిం లీగ్- నవాజ్ ప్రభుత్వం అనుసరిస్తోన్న పన్నుల విధానాలను నిరసనకారులు తప్పుపడుతున్నారు. పెట్రోలియం లెవీని ఉపసంహరించుకోవాలంటూ నినాదాలు చేస్తోన్నారు. తక్కువ ధరకే ఇంధనం కావాలంటూ గళమెత్తారు. ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ వ్యతిరేక ప్రదర్శనలన్నింటికీ కూడా జమాత్-ఎ-ఇస్లామీ నాయకత్వాన్ని వహిస్తోంది.
ఈ సందర్భంగా ఆ పార్టీ అధినేత హఫీజ్ నయీముర్ రెహమాన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఇతర మంత్రులపై నిప్పులు చెరిగారు. ప్రభుత్వం, అధికార యంత్రాంగం మొత్తం కూడా ప్రజల ప్రయోజనాలను గాలికొదిలేసి అవినీతిలో కూరుకుపోయాయని ఆరోపించారు. తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే సామాన్యులపై ఈ రకమైన పన్నులను మోపుతున్నారని, దీన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఐఎంఎఫ్ నిబంధనలను అడ్డుపెట్టుకుని పెట్రోలియం పన్నులను తగ్గించలేమని ప్రభుత్వం చెబుతున్న సాకులను రెహమాన్ తోసిపుచ్చారు. పేద ప్రజలు, విద్యార్థులను పన్నుల పేరుతో పీడించడం తగదని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం ఇప్పటివరకు సేకరించిన భారీ పన్నుల నిధులను ప్రజల కోసం కాకుండా తమ విలాసాలకు వాడుకుంటోన్నారని ధ్వజమెత్తారు. ఈ నిరసనలు ఆరంభం మాత్రమేనని, రానున్న రోజుల్లో తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
పాకిస్తాన్ లో కొంతకాలంగా పెట్రోలియం ఉత్పత్తుల ధరలు ఊహించని విధంగా ఆకాశాన్నంటుతున్నాయి. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితులు, హార్ముజ్ జలసంధి వద్ద చోటుచేసుకున్న ఉద్రిక్తతల వల్ల చమురు సరఫరా తీవ్రంగా దెబ్బతింది. దీంతో పెట్రోల్ ధర లీటరుకు దాదాపు 459 పాకిస్తానీ రూపాయలకు చేరగా, డీజిల్ ధర లీటరుకు 520 పాకిస్తానీ రూపాయల మార్కును దాటింది. ప్రపంచంలో అత్యధికంగా ఇంధన ధరలు పెరిగిన దేశాల్లో మయన్మార్ తర్వాత పాకిస్తాన్ రెండో స్థానంలో నిలిచింది.
పెరుగుతున్న ధరలను అదుపు చేయడానికి పెట్రోలియం శాఖ మంత్రి అలీ పర్వేజ్ మాలిక్ ఇటీవలే పెట్రోలియం లెవీని ప్రవేశపెట్టారు. దీని కింద రోజువారీగా అంతర్జాతీయ మార్కెట్ ధరల ఆధారంగా ఇంధన ధరలను సమీక్షించే విధానాన్ని తీసుకొచ్చారు. ఈ చర్యలు నిత్యావసర వస్తువులపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. రవాణా ఖర్చులు విపరీతంగా పెరగడంతో స్థానిక మార్కెట్లలో నిత్యావసరాల ధరలు పెరిగి, సామాన్య మరియు మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్ పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది.





Click it and Unblock the Notifications