అంత్యక్రియలకు 'ఏఐ' ముహూర్తం.. తర్వాత అదే కంపెనీపై కేసు!
ఈ రోజుల్లో ప్రజలు చిన్న, పెద్ద పనుల కోసం కృత్రిమ మేధ వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రశ్నలు అడగడం నుంచి సమాచారం సేకరించడం, ముఖ్యమైన నిర్ణయాలపై సలహాలు తీసుకోవడం వరకు ఏఐ వినియోగం వేగంగా పెరుగుతోంది. అయితే చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్లోని జియాషాన్ కౌంటీలో వినూత్నమైన, విచిత్రమైన ఘటన వెలుగు చూసింది. ఇటీవల తన తల్లిని కోల్పోయిన 'షీ' అనే వ్యక్తి, ఆమె అంత్యక్రియల నిర్వహణ కోసం శుభ ముహూర్తాన్ని ఎంచుకోవడానికి ఓ ఏఐ చాట్ బాట్ సలహాను తీసుకున్నాడు. ఏఐ సూచించిన తేదీని ప్రామాణికంగా తీసుకుని అతను అంత్యక్రియల కార్యక్రమాన్ని పూర్తి చేశాడు. అయితే ఆ తర్వాత తన కుటుంబంలో ఓ దురదృష్టకర సంఘటన జరగడంతో దానికి ఏఐ ఇచ్చిన తప్పుడు సలహానే కారణమని ఆరోపిస్తూ ఆ టెక్నాలజీని తయారు చేసిన కంపెనీపై చట్టపరమైన చర్యలకు పూనుకున్నాడు.
ఏఐ కంపెనీపై దావా
చైనా సంప్రదాయాల ప్రకారం వివాహాలు, అంత్యక్రియలు వంటి ముఖ్యమైన కార్యక్రమాలకు ప్రాచీన క్యాలెండర్ల ఆధారంగా శుభ ముహూర్తాలను ఎంచుకోవడం సాధారణం. షీ కూడా చాట్బాట్ చెప్పిన తేదీనే పాటించినప్పటికీ.. అంత్యక్రియల అనంతరం తన కుటుంబంలో అనుకోని అశుభం జరగడంతో ఆగ్రహానికి గురయ్యాడు. చాట్బాట్ ఇచ్చిన తప్పుడు సమాచారం వల్లే తనకు నష్టం జరిగిందని పేర్కొంటూ కంపెనీపై కేసు వేశాడు. అయితే ఏఐ సూచించిన తేదీకి, అతని ఇంట్లో జరిగిన దురదృష్టకర ఘటనకు ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేదా ప్రత్యక్ష సంబంధం లేదని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

అదే ఏఐతో లీగల్ నోటీసులు తయారీ
ఈ మొత్తం ఉదంతంలో అత్యంత విచిత్రమైన అంశం ఏమిటంటే.. సదరు ఏఐ కంపెనీపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి లీగల్ డాక్యుమెంట్లు, పత్రాలను సిద్ధం చేయడానికి షీ ఏదే ఏఐ చాట్ బాట్ను ఉపయోగించడం. ఓవైపు ఏఐ ఇచ్చిన సలహా వల్ల నష్టం జరిగిందని ఆరోపిస్తూనే మరోవైపు దావాకు సంబంధించిన ప్రక్రియల కోసం మళ్లీ అదే టెక్నాలజీపై ఆధారపడటం నెటిజన్లలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఏఐ సలహాలపై అప్రమత్తత అవసరం
ఈ ఘటన సాంకేతిక పరిజ్ఞానం, ఏఐ వినియోగంపై సమాజంలో ముఖ్యమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. నిర్ణయాలు తీసుకోవడం ఏఐ చాట్బాట్లు కొంతవరకు ఉపయోగపడినప్పటికీ.. వాటి సమాధానాలను గుడ్డిగా నమ్మడం శ్రేయస్కరం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.














Click it and Unblock the Notifications
