పెరిగిన పాల ధరలు... పొరుగు రాష్ట్రంలో డెయిరీల షాక్!
నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదలతో సతమతమవుతున్న సామాన్య జనం నెత్తిన మరో పిడుగు పడింది. పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలో పాల ధరలను పెంచుతూ పాడి సహకార, ప్రైవేట్ డైరీల సమాఖ్య కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 11వ తేదీ నుంచి అమలులోకి వచ్చేలా లీటరు ఆవు పాలు, గేదె పాల ధరలపై సమానంగా రూ. 2 చొప్పున పెంచుతున్నట్లు డెయిరీ యజమానుల సంక్షేమ సంఘం ప్రకటించింది. ఈ సడన్ నిర్ణయంతో సామాన్య కుటుంబాల నెలవారీ బడ్జెట్ తలకిందులయ్యే పరిస్థితి నెలకొంది.
రైతుల ప్రయోజనాల కోసమే నిర్ణయం
పశువుల దాణా ధరలు విపరీతంగా పెరగడం, నిర్వహణ వ్యయం భారం కావడంతో పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకే ఈ ధరల పెంపు నిర్ణయం తీసుకున్నట్లు సంఘం ప్రతినిధులు స్పష్టం చేశారు. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా కోఆపరేటివ్ , ప్రైవేట్ డైరీలు పాల ధరలను నిర్ణయిస్తాయని, పెరుగుతున్న వ్యయాన్ని తట్టుకోవాలంటే ధర పెంచక తప్పలేదని చెబుతున్నారు. అయితే వినియోగదారులకు మరీ అంత భారం పడకుండా కేవలం రెండు రూపాయల మేరకే పెంచామని డెయిరీ సంఘాలు వివరణ ఇచ్చాయి.

పాలపై 'ఎంఎస్పీ' ప్రసక్తే లేదు: కేంద్రం స్పష్టత
మరోవైపు పాలకు కనీస మద్దతు ధర కల్పించే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వ పరిశీలనలో లేదని ఇటీవలే పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. డిమాండ్, సరఫరా సూత్రాల ప్రాతిపదికన ప్రైవేట్, కోఆపరేటివ్ డైరీలే ధరలను ఖరారు చేసుకుంటాయని వెల్లడించింది. అయితే పాడి రంగంలో విప్లవాత్మక మార్పుల కోసం గ్రామీణ స్థాయిలో వేలాది కొత్త సొసైటీలను ఏర్పాటు చేయడంతో పాటు, నాణ్యతా ప్రమాణాలు పెంచేందుకు చల్లింగ్ ప్లాంట్లు, టెస్టింగ్ పరికరాలను కేంద్రం పెద్ద ఎత్తున అందిస్తోంది.
భారత్లో రికార్డు స్థాయికి పాల ఉత్పత్తి
ప్రభుత్వం చేపడుతున్న జన్యు అభివృద్ధి, ఉచిత కృత్రిమ గర్భధారణ వంటి పథకాల వల్ల గత పదేళ్లలో దేశంలో పాల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. 2014-15లో 146 మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉన్న పాల దిగుబడి, 2024-25 నాటికి ఏకంగా 248 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరి దాదాపు 69 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఉత్పత్తి రికార్డు స్థాయిలో పెరిగినప్పటికీ, స్థానిక మార్కెట్ నిర్వహణ వ్యయాల వల్ల ధరల పెంపు తప్పడం లేదని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.




Click it and Unblock the Notifications