దేశంలో అత్యంత ధనిక ఎంపీలు మనోళ్ళే.. నేరాల్లోనూ టాప్ లో..!
అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) తాజా నివేదికలో తెలంగాణ రాజ్యసభ సభ్యులు దేశవ్యాప్తంగా అందరి దృష్టి ఆకర్షించారు. దేశంలోని 226 మంది ప్రస్తుత రాజ్యసభ ఎంపీల మొత్తం ఆస్తుల విలువ రూ.26,047 కోట్లుగా నమోదు కాగా, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్కు చెందిన 18 మంది ఎంపీల ఆస్తులు దీనిలో 39.39 శాతం ఉన్నాయి. ఇది రూ.10,259 కోట్లకు సమానం.
దేశవ్యాప్త ఎంపీల ఆస్తుల్లో దాదాపు మూడోవంతు వాటా తెలంగాణా నుండే
ముఖ్యంగా తెలంగాణ నుంచి ఉన్న ఏడుగురు ఎంపీల ఆస్తుల విలువ ఏకంగా రూ.8,310 కోట్లుగా ఉంది. ఇది దేశవ్యాప్త ఎంపీల ఆస్తుల్లో దాదాపు మూడో వంతు వాటా అని చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్ నుంచి 11 మంది ఎంపీల ఆస్తులు రూ.1,949 కోట్లుగా ఉన్నాయి. తెలంగాణలో 57 శాతం ఎంపీలు బిలియనీర్లుగా నిలవడం గమనార్హం.

టాప్-3లో తెలంగాణ హవా.. టాప్ 1 ఈయనే
రాజ్యసభలో అత్యధిక సంపద కలిగిన మొదటి ముగ్గురు ఎంపీల్లో ఇద్దరు తెలంగాణకు చెందినవారే ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యులైన బండి పార్థసారథి రూ.5,300 కోట్ల ఆస్తులతో దేశంలోనే అగ్రస్థానం సాధించారు. రెండవ స్థానంలో పంజాబ్కు చెందిన బీజేపీ ఎంపీ రాజేందర్ గుప్తా (రూ.5,053 కోట్లు) తో ఉండగా, మూడవ స్థానంలో తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున అభిషేక్ మను సింఘ్వీ రూ.2,558 కోట్ల ఆస్తులతో నిలిచారు.
నేర చరిత్రలోనూ తెలంగాణా ఎంపీలే టాప్
తెలంగాణలోని మూడు BRS ఎంపీల ఆస్తులు మాత్రమే రూ.5,524 కోట్లు ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. ఆస్తులతో పాటు నేర చరిత్రలో కూడా తెలంగాణ ఎంపీలు దేశంలో ముందున్నారు. ఏడుగురు తెలంగాణ రాజ్యసభ సభ్యుల్లో ఐదుగురిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వీరిలో ముగ్గురిపై తీవ్రమైన నేరాల కేసులు ఉన్నాయి. బీఆర్ఎస్ నుంచి ముగ్గురు, కాంగ్రెస్ నుంచి ఇద్దరు ఎంపీలు ఈ జాబితాలో ఉన్నారు.
నేరాల్లో బీహార్, మహారాష్ట్రాలనే దాటేసిన తెలంగాణా
ఈ విషయంలో తెలంగాణ మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, బిహార్ వంటి రాష్ట్రాల కంటే ముందున్నట్లు ADR స్పష్టం చేసింది. ఇక పార్టీల వారీగా చూస్తే, దేశవ్యాప్తంగా వంద కోట్లకు పైగా ఆస్తి ఉన్న 31 మంది ఎంపీల్లో బీజేపీ నుంచి ఏడుగురు, కాంగ్రెస్ నుంచి ఆరుగురు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి టీడీపీ, వైసీపీ, బీఆర్ఎస్ నుంచి ఇద్దరు చొప్పున, జనసేన నుంచి ఒకరు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో ఆస్తుల పరిమాణంపై చర్చ
ఈ నివేదిక తెలంగాణ రాజకీయాల్లో ఆస్తుల పరిమాణం ఎంత ఎక్కువగా ఉందో స్పష్టంగా చూపిస్తోంది. అయితే, ఆస్తులతో పాటు నేర చరిత్ర, క్రిమినల్ కేసులు కూడా ఎక్కువగా ఉండటం ప్రజల మధ్య చర్చనీయాంశమవుతోంది. ప్రస్తుతం ఈ ఏడీఆర్ నివేదిక అందరిలో ఆసక్తి పెంచుతుంది.












Click it and Unblock the Notifications