తేజస్ ఎక్స్ప్రెస్ బిర్యానీలో ఈగ! IRCTC సంచలన యాక్షన్
రైలు ప్రయాణంలో వేడివేడి బిర్యానీ ఆర్డర్ చేసుకుని, ముద్ద నోట్లో పెట్టుకునే లోపు అందులో ఒక చచ్చిన ఈగ కనిపిస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇలాంటి చేదు అనుభవమే ప్రతిష్టాత్మక 'తేజస్ ఎక్స్ప్రెస్'లో ఒక ప్రయాణికుడికి ఎదురైంది. లగ్జరీ ప్రయాణానికి, నాణ్యమైన సేవలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచే తేజస్ ఎక్స్ప్రెస్లో వడ్డించిన వెజ్ బిర్యానీ కాంబో మీల్లో ఈగ రావడంతో ప్రయాణికుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన ట్రైన్ కెప్టెన్, క్యాటరింగ్ మేనేజర్ సదరు ప్రయాణికుడికి క్షమాపణలు చెప్పి, ప్రత్యామ్నాయంగా మరో ఫుడ్ ప్లేట్ను అందించినప్పటికీ.. ఈ నిర్లక్ష్యంపై ఐఆర్సీటీసీ (IRCTC) తీవ్రంగా స్పందించింది.
లక్ష రూపాయల జరిమానా.. లైసెన్స్ రద్దుకు నోటీస్
ఫుడ్ క్వాలిటీ విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేస్తూ, సదరు ఫుడ్ వెండర్కు ఐఆర్సీటీసీ ఏకంగా రూ. 1 లక్ష జరిమానా విధించింది. అంతేకాదు, అంతటితో వదలకుండా నిబంధనలను ఉల్లంఘించినందుకు సదరు విక్రయదారుడి క్యాటరింగ్ లైసెన్స్ను ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ 'షోకాజ్' నోటీసు జారీ చేసింది. తాజా, నాణ్యమైన ముడిసరుకులను మాత్రమే వాడాలని, బియ్యం, పప్పులు, మసాలా దినుసులు నిల్వ ఉంచే కంటైనర్లు గాలి చొరబడకుండా (ఎయిర్ టైట్) ఉన్నాయో లేదో ప్రతిరోజూ తనిఖీ చేయాలని కఠిన ఆదేశాలు జారీ చేసింది.

టాయిలెట్లో గిన్నెలు.. పాత ఘటనల గుట్టు రట్టు..
రైల్వే క్యాటరింగ్లో ఇలాంటి దారుణాలు బయటపడటం ఇదే మొదటిసారి కాదు. కొన్నిరోజుల క్రితమే, 'దురంతో ఎక్స్ప్రెస్' టాయిలెట్లో క్యాటరింగ్ సిబ్బంది వంట గిన్నెలను కడుగుతున్న ఒక షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) రంగంలోకి దిగింది. ఆహార భద్రతా నిబంధనల ప్రకారం (Schedule 4) కఠినమైన పరిశుభ్రత ప్రమాణాలు పాటించడంలో వైఫల్యం చెందినందుకు గానూ ఐఆర్సీటీసీకి ఎఫ్ఎస్ఎస్ఏఐ అప్పట్లోనే అధికారికంగా నోటీసులు జారీ చేసింది.
రైల్వే ప్రయాణికుల ఆరోగ్యం, భద్రతతో ఆడుకునే కాంట్రాక్ట్ సిబ్బంది మరియు వెండర్లపై ఇకపై కఠినమైన చర్యలు ఉంటాయని, నిరంతర తనిఖీలు కొనసాగుతాయని రైల్వే శాఖ ఈ చర్యల ద్వారా హెచ్చరించింది.














Click it and Unblock the Notifications