వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పద్మ పురస్కారం, నూకలకు విశాఖ నమస్కారం

By Santaram
|
Google Oneindia TeluguNews

Nookala Chinna Satyanarayananookala
విశాఖపట్నం: ప్రముఖ సంగీత విద్వాంసులు నూకల చిన సత్యనారాయణకు పద్మభూషణ్ అవార్డు రావడంతో విశాఖ ప్రజల గుండెల్లో ఆనందసాగరం ఉవ్వెత్తున ఎగిసింది. సాగర తీర నగరంలో సంగీత సాగరాన్ని మధించిన మహా విద్వాంసుడికి సముచిత గౌరవం దక్కింది. నాదోపాసనే జీవిత పరమావధిగా ఆరు దశాబ్దాల పైచిలుకు నూకల చిన సత్యనారాయణ చేసిన కృషిని కేంద్ర ప్రభుత్వం 'పద్మ భూషణ్‌' ప్రకటించడం ద్వారా గుర్తించింది. సోమవారం నూకలకు ఈ పురస్కారం ప్రకటించగానే విశాఖ సంగీత ప్రియులు ఉబ్బి తబ్బిబ్బయ్యారు.

విశాఖ జిల్లాలోని అనకాపల్లిలో యజ్ఞ చయనమ్మ, అన్నపూర్ణేశ్వర శర్మ దంపతులకు 1927 ఆగస్టు నాలుగోతేదీన ఆయన జన్మించారు. శాస్త్రీయ సంగీతంలో తొలిపాఠాలను తల్లి వద్దే నేర్చుకున్నారు. కంభంపాటి అక్కాజీరావు వద్ద వాయులీన విద్య అభ్యసించి విజయవాడలో కొన్నాళ్లు మంగళంపల్లి పట్టాభిరామయ్య వద్ద ఈ విద్యలో మెళకువలు నేర్చుకున్నారు. విజయనగరంలో ఆచార్య ద్వారం వెంకట స్వామి నాయుడు శుశౄషతో నూకల సంగీతాభ్యాసం పరిణతి చెందింది. నాయుడుతో దేశంలోని ప్రధాన సభలెన్నింటిలోనో కచేరీ చేసిన అనుభూతి గడించారు. సంగీత విద్వాంసులు డాక్టర్‌ శ్రీపాద పినాకపాణి పరిచయంతో నూకల స్థాయి మారిపోయింది. కృతుల్లోని గూఢార్థాలు, భావాన్నిఆవిష్కరించే తీరు క్షుణ్ణంగా అధ్యయనం చేశారు.

నేదునూరి కృష్ణమూర్తి, శ్రీరంగం గోపాలరత్నం అప్పట్లో సత్యనారాయణకు సహచరులు. నగరంలోని అతి పురాతన సంగీత సభల్లో ఒకటైన శ్రీ విజయ త్యాగరాయ సంగీత సభ అప్పట్లో టౌన్‌ హాల్‌ సమీపాన ఉండే శివరామయ్య స్కూల్‌ ప్రాంగణంలో నిర్వహించిన సంగీత కళాశాలలో అధ్యాపకుడిగా ఐదేళ్లపాటు సేవలందించారు. అంతేకాదు 'సంగీత మిత్ర బృందం' పేరుతో సత్యారావు, ఆకెళ్ల కృష్ణమూర్తిలతో కలసి టౌన్‌ హాల్‌లో సంగీత కచేరీలు, సంగీతంపై సదస్సులు నిర్వహించడంలో ప్రధాన భూమిక పోషించారు.

తొలినాళ్లలో బాల నటుడిగా రంగస్థల ప్రదర్శనలు కూడా ఇచ్చారు. విశ్వ కళాపరిషత్‌ స్థాపించి వందల సంఖ్యలో శాస్త్రీయ సంగీత నిష్ణాతుల్ని తయారు చేశారు. ఆంధ్రా, శ్రీ వెంటేశ్వర విశ్వ విద్యాలయాల్లో బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ సభ్యుడిగా నూకల సేవలు అనితర సాధ్యం. స్వతంత్య్ర భారతదేశపు తొలి ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ, రాష్ట్రపతి సర్వేపల్లి రాధా కృష్ణన్‌ వంటి మహనీయుల సమక్షంలో కచేరీలు చేసి మన్ననలందుకున్న ఘన చరిత్ర ఈయనకుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X