ధరల పెరుగుదలపై ఆర్థిక సర్వే ఆందోళన
వ్యవసాయ రంగంలో వృద్ధిరేటు 0.2 శాతం తగ్గిందని పన్నెండవ ఆర్థిక సంఘం నిర్వహించిన సర్వే తేల్చింది. వ్యవసాయ వృద్ధిరేటు జిడిపిలో 4శాతంగా ఉంటే తప్ప ఆహార భద్రత సాధ్యం కాదని ఆర్థిక సర్వే పేర్కొన్నది. నిరుడు ఆర్థిక మాంద్యం, ఆహార ద్రవ్యోల్బణం కారణంగా జిడిపి వృద్ధిరేటు తగ్గిందని, ఈ ఏడాది 8.75 శాతం వృద్ధిరేటు సాధించే అవకాశం ఉన్నదని ఆర్థిక సర్వే సారాంశాన్ని ప్రణబ్ సభకు వివరించారు. అలాగే బంగారం నిల్వల్లో మనదేశం ప్రపంచం లోనే పదవ స్థానంలో ఉన్నదని ఆయన చెప్పారు. ఆహార సబ్సిడీలను నేరుగా ప్రజలకే అందించాల్సిన అవసరాన్ని ఆర్థిక సర్వే ప్రముఖంగా పేర్కొన్నది.
ఆర్థిక పురోభివృద్ధి కి పెట్రో ఉత్పత్తులపై సబ్సిడీని ఎత్తివేయాలని, వివిధ రంగాలలో విదేశీ పెట్టుబడులకు అనుమతించాలని కూడా ఆర్థిక సర్వే సూచించింది. దీన్నిబట్టి చూస్తే రేపటి ప్రణబ్ ముఖర్జీ బడ్జెట్లో మార్కెట్కు తగిన ప్రోత్సాహకాలేమీ ఉండకపోవచ్చని స్పష్టమవుతోంది. అదే మార్గంలో దశల వారీ ఉద్దీపనల ఉపసంహరణ ఖాయమనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఆర్థిక మాంద్యం వల్ల భారతీయ మార్కెట్లు ఢీలా పడ్డాయని తెలిపింది. ఆహార సబ్సిడీని కుటుంబానికే నేరుగా అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పింది. స్టాక్ మార్కెట్ మరింత పటిష్టంగా, స్థిరంగా ఉండేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపింది.