ఏకాభిప్రాయ సాధనకే శ్రీకృష్ణ కమిటీ: పిఎం
అణచివేతకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని తాము నిర్ణయించుకున్నా, బేషరతుగా హింసను వదిలిపెట్టిన ఏ వేర్పాటువాద సంస్థతోనైనా చర్చలు జరపడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మన్మోహన్సింగ్ స్పష్టం చేశారు. అయితే, ఆయా సంస్థలు రాజ్యాంగ ప్రక్రియకు కట్టుబడి ఉంటామని అంగీకరించాల్సి ఉంటుందన్నారు. నక్సల్ ప్రభావిత రాష్ట్రాలతో చర్చించి మావోయిస్టు సమస్యను ఎదుర్కొనేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్లు వివరించారు. మావోయిస్టులు కొన్నిచోట్ల చిన్నారులను కూడా ఉపయోగించుకుంటున్నట్లు తమకు నివేదికలు అందాయని, నక్సల్ హింసను అణచి వేసేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. నక్సల్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఇటీవల జరిగిన సమావేశంలో తాజా పరిస్థితని సమీక్షించామని, మావోయిస్టులకు వ్యతిరేకంగా పోరాడుతున్న భద్రతా దళాలు గణనీయ విజయాలు సాధించాయని కితాబిచ్చారు.
ప్రస్తుత సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్ల బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడతామని ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పారు. ముఖ్యమైన ఈ బిల్లుకు మద్దతివ్వాలని ప్రధాని సభ్యులందరికీ విజ్ఞప్తి చేశారు. "మహిళా బిల్లును మేం 2008 మేలో రాజ్యసభలో ప్రవేశపెట్టాం. ఈ బిల్లుపై ఇప్పటికే పార్లమెంటరీ స్థాయీ సంఘం ఇచ్చిన నివేదికను కూడా మేం పరిగణనలోకి తీసుకున్నాం. ఈ బిల్లుకు సభ్యులు మద్దతిస్తారని నేను విశ్వసిస్తున్నాను. ఎందుకంటే మహిళల సాధికారతకు మనం కట్టుబడి ఉన్నామని బలంగా చెప్పుకోడానికి ఇది ఉపకరిస్తుంది" అని ప్రధాని అన్నారు.