తెలంగాణ అంశం: టిడీపి ఎమ్మెల్యే మైనంపల్లి రాజీనామా
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని టీడీపీ జిల్లా అధ్యక్షుడు మైనంపల్లి హన్మంతరావు చేసిన ప్రకటనపై పార్టీ శ్రేణులు నిరసనకు దిగాయి. రాజీనామా ఉపసంహరించుకోవాలంటూ జిల్లా నుంచి వెళ్లిన పార్టీ కార్యకర్తలు, నాయకులు శనివారం సికింద్రాబాద్ అల్వాల్లోని మైనంపల్లి నివాసం ఎదుట బైఠాయించారు. మైనంపల్లి మాత్రం అజ్ఞాతంలోకి వెళ్లారు. కొందరు పార్టీ కార్యకర్తలు మైనంపల్లి ఇంటి పైకి ఎక్కి రాజీనామా ఉపసంహరించుకోని పక్షంలో కిందకు దూకుతామంటూ హెచ్చరించారు. పోలీసులు, పార్టీ నేతల జోక్యంతో కార్యకర్తలు శాంతించారు.
మెదక్ ఎమ్మెల్యే పదవికి ఈ నెల 9న రాజీనామా చేస్తున్నట్లు టీడీపీ జిల్లా అధ్యక్షుడు మైనంపల్లి హన్మంతరావు ప్రకటించారు. తెలంగాణ అమరుల కుటుంబాలకు పోటీ అవకాశం కల్పిస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో పదవికి రాజీనామా చేయొద్దంటూ మెదక్ నియోజకవర్గం పరిధిలోని రామాయంపేట, పాపన్నపేట, మెదక్, చిన్నశంకరంపేట తదితర మండలాల నుంచి సుమారు 60 వాహనాల్లో టీడీపీ కార్యకర్తలు శనివారం హైదరాబాద్కు వెళ్లారు. జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీల నేతృత్వంలో సికింద్రాబాద్ అల్వాల్లోని మైనంపల్లి హన్మంతరావు నివాసం ఎదుట టెంట్ వేసుకుని ధర్నాకు దిగారు.
అయితే పార్టీ శ్రేణులు వస్తున్న విషయాన్ని ముందుగానే తెలుసుకున్న హన్మంతరావు శనివారం ఉదయం నుంచే ఫోన్లు స్విచాఫ్ చేసుకుని అందుబాటులో లేకుండా పోయారు. సాయంత్రం వరకు కూడా మైనంపల్లి అందుబాటులోకి రాకపోవడంతో తెలుగు రైతు జిల్లా అధ్యక్షుడు బాలకృష్ణారెడ్డి, బీసీ విభాగం రాష్ట్ర్ర కార్యవర్గ సభ్యులు సోములు, ఏడుపాయల మాజీ చైర్మన్ జీవన్రెడ్డి, మండల అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, మెదక్ మండలం శమ్నాపూర్కు చెందిన చారి తదితరులు ఇంటిపైకి ఎక్కారు.