టీవీ- 5 జర్నలిస్టు అవినీతి గుట్టురట్టు
ఇక్కడ జర్నలిస్టుకు అంత సీను లేదు. అందుకే బేరం పది లక్షల దగ్గరే ఆగిపోయింది. విషయానికి వస్తే...టీవీ-5 చానల్లో కొన్ని నెలల కిందట ఓ కథనం ప్రసారమైంది. గుంటూరుకు చెందిన విజయసారథి హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అక్రమ మార్గంలో వ్యాపారం చేస్తోందని, లే ఔట్లకు అనుమతులు లేవని, భూములే రిజిస్టర్ కాలేదని దాని సారాంశం. దీంతో కంగారు పడ్డ ఆ కంపెనీ వారు స్టోరీ ఆపండి బాబో అంటూ హైదరాబాద్కు పరుగు తీశారు. ఆ తర్వాత అసలు స్టోరీ మొదలైంది. గుంటూరులోని విజయసారథి రియల్ ఎస్టేట్ సంస్థ చిలకలూరిపేట వద్ద 9 ఎకరాల్లో ఓ వెంచర్ను, అన్ని అనుమతులకు దరఖాస్తు చేసుకొని, ప్లాట్ల విక్రయం ప్రారంభించింది.
అదే సంస్థ మార్కెటింగ్ లో పని చేస్తున్న భైరవపాడుకు చెందిన బుజ్జి... తన స్నేహితుడైన టీవీ-5 జర్నలిస్టు సీతారామరాజును సభ్యునిగా చేర్పించాడు. అయితే, అనుమతులు లేకుండానే వ్యాపారం చేస్తున్నారని బెదిరిస్తూ ఆ సంస్థ అధినేతతో రామరాజు బేరసారాలు సాగించాడు. బేరం కుదరకపోవడంతో చానల్లో ఓ స్టోరీ ప్రసారం చేశారు. ఆ తర్వాతి రోజు దానిని ఆపేందుకు డబ్బులివ్వాలంటూ బ్లాక్ మెయిల్ చేశారు. ఇందులో మధ్యవర్తిగా వ్యవహరించిన బుజ్జి పలు దఫాలు సంస్థ ఎండీఅల్లాబక్ష్తో మంతనాలు సాగించాడు. తొలుత రూ.10 లక్షలు డిమాండ్ చేశారు. ఆ తరువాత రామరాజు గుంటూరులోని ఆ సంస్థ కార్యాలయానికి వచ్చి బేరసారాలు సాగించి రూ. 4 లక్షల వరకు దిగి వచ్చాడు.
అయినా, అంత డబ్బు ఇవ్వలేమని అల్లాబక్ష్ తేల్చిచెప్పాడు. రామరాజు వెళ్లిపోగా, మధ్యవర్తిగా వ్యవహరించిన బుజ్జి..రూ.లక్ష అయినా ఇవ్వాలని కోరాడు. దీంతో రియల్ ఎస్టేట్ వారు రామరాజును గుంటూరుకు పిలిపించమన్నారు. రామరాజు గుంటూరు రాగా, ఆ కంపెనీకి చెందిన మనుషులు ఉచ్చు బిగించేశారు. అల్లాబక్ష్ అనుచరుడు నాగేశ్వరరావు అమర్చిన స్పై కెమెరాకు రామరాజు అడ్డంగా దొరికిపోయాడు.