జగన్ తో విభేదాలు లేవు: రోశయ్య
అవసరమైతే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని ఆయన చెప్పారు. మంత్రివర్గంలో అధిక ప్రాధాన్యం ఉన్న జిల్లాల్లో తగ్గించాల్సి ఉంటుందని, ప్రాతినిధ్యం లేని జిల్లాలకు, ప్రాంతాలకు ప్రాతినిధ్యం కల్పించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. మంత్రివర్గ విస్తరణ చేయాల్సి వస్తే చెప్పే చేస్తానని, పార్టీ అధిష్టానం అనుమతి తీసుకుని మంత్రివర్గ విస్తరణ చేస్తానని ఆయన అన్నారు. నామినేటెడ్ పదవులను వెంటనే భర్తీ చేసే ఆలోచన లేదని, అయితే తగిన సమయంలో భర్తీ చేస్తామని ఆయన చెప్పారు.
మంత్రులతో కూడా తనకు ఏ విధమైన విభేదాలు లేవని ఆయన చెప్పారు. సమష్టిగానే ముందుకు సాగుతున్నామని ఆయన అన్నారు. బాధ్యతలను సమష్టిగా పంచుకోవడం అవసరమని ఆయన అన్నారు. సమస్యలను చూసి పారిపోవడం కాకుండా వాటిని పరిష్కరించుకునే దిశగా సాగడం తనకు అలవాటు అని ఆయన చెప్పారు. కాంగ్రెసు ఏడాది పాలన సంతృప్తికరంగా సాగిందని ఆయన చెప్పారు. కొత్త సంక్షేమ పథకాలు ఉండవని ఆయన స్పష్టం చేశారు.