చంద్రబాబుపై హరికృష్ణ విమర్శలు చేయలేదా: రామచంద్రయ్య
చంద్రబాబుది వాడుకుని వదిలేసే నైజమని ప్రపంచానికి బహుచక్కగా చాటిచెప్పింది హరికృష్ణేనని రామచంద్రయ్య అన్నారు. చంద్రబాబుపై ఇంత ప్రేమ ఎప్పుడు పుట్టుకొచ్చిందని ప్రశ్నించారు. "మొన్న మహానాడు వేదికపై ఎన్టీఆర్ కుటుంబసభ్యుల్ని పావులుగా వాడుకుంటున్నారని మీరే అన్నారు కదా! దివంగత ఎన్టీఆర్ గురించి మాట్లాడే హక్కు మీకు, చంద్రబాబుకి ఉందా? చంద్రబాబుకి వత్తాసు పలికితే మీ తండ్రి ఆత్మ క్షోభిస్తుంది. ఎన్టీఆర్పై చెప్పులు వేయిస్తే మీకు ఉక్రోషం రాలేదుగాని చంద్రబాబు నైజం గురించి మాట్లాడితే తట్టుకోలేక పోతున్నారు" అని అన్నారు. అవినీతి కాంగ్రెసులో ఉన్నందుకు సోదరి పురంధరేశ్వరికి, బావ దగ్గుబాటి వెంకటేశ్వర రావుకు ఎందుకు లేఖలు రాయలేదని ఆయన ప్రశ్నించారు.
తమ పార్టీ కాంగ్రెసుకు అంశాలవారీగా మద్దతిస్తూ ముందుకు సాగితే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు శూన్యమనే భయంతోనే తమపై హరికృష్ణ విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రజాతీర్పును చిరంజీవి హుందాగా అంగీకరించారని, చంద్రబాబు అంగీకరించలేదని ఆయన అన్నారు. చింరజీవిపై దొంగదాడులు ఇప్పటికీ ఆగలేదని, సొంత చానెల్ పెట్టుకుని చిరంజీవిపై విమర్సలు చేస్తున్నారని ఆయన అన్నారు.