అబ్బే.. ఆ కమిటీ రాష్ట్ర విభజన కోసం కాదు: కేంద్రం

రాష్ట్ర విభజనం కోసం కేంద్రం.. శ్రీ కృష్ణ కమిటీ ఏర్పాటుతో పాటు, రాజ్యాంగంలోని మూడవ అధికరణానికి భంగం కలిగించే విధంగా వ్యవహరించటాన్ని సవాల్ చేస్తూ విజయవాడకు చెందిన సమతా పార్టీ జాతీయ నేత, సమైక్యాంధ్ర ప్రతినిధి వి.వి.కృష్ణారావు, తిరుపతికి చెందిన కె.పుష్పలత ఈ ఏడాది ఫిబ్రవరి ఐదో తేదీన సుప్రీం కోర్టులో పిటీషన్ ను దాఖలు చేశారు.
ఈ పిటీషన్ పై జస్టిస్ కపాడియా, రాధాకృష్ణన్ తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. పిటీషనర్ల తరపున హరీశ్ సాల్వే వాదించారు. పిటీషనర్లు లేవనెత్తిన మౌలిక అంశాలు, శ్రీకృష్ణ కమిటీపై తమకు సమాధానం ఇవ్వాలని సుప్రీం కోర్టు కేంద్రానికి నోటీసులు పంపగా, వీటిపై కేంద్రం తగిన రీతిలో సమాధానం ఇచ్చింది. కేంద్రం సమర్పిచిన సమాధాన పత్రంలో శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు ఉద్దేశాన్ని స్పష్టం చేసింది. రాష్ట్ర విభజన కోసం మాత్రం కమిటీని ఏర్పాటు చేయలేదని తేల్చిచెప్పింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను తెలుసుకునేందుకు, అధ్యయనం చేసేందుకు మాత్రమే ఏర్పాటు చేసినట్టు పేర్కొంది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించినట్టు కేంద్రం ఏనాడూ ప్రకటించలేదని కూడా సుప్రీంకోర్టుకు పంపిన సమాధాన పత్రంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడం గమనార్హం. కేంద్రం తాజా సమాధానంపై తెలంగాణ ప్రాంత నేతలు ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications