ఓదార్పుపై యాక్షన్ షురూ: ఈ ఇద్దరు మంత్రులపై వేటు?
అదే సమయంలో మరో మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ పై కూడా వేటు పడే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. తనకు అధిష్టానం అంటే ఎవరో తెలియదని, తాను జగన్ వెంట ఉంటానని చెబుతూ ఆయన ఓదార్పు యాత్రలో కూడా పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా ఓదార్పు యాత్రలో ఆయన పాల్గొన్నారు. దీంతో పిల్లి సుభాష్ చంద్రబోస్ ను కూడా రాజీనామా చేయాలని ముఖ్యమంత్రి అడిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వారిద్దరికి ఉద్వాసన చెప్పాలని ఇప్పటికే కాంగ్రెసు అధిష్టానం నుంచి ముఖ్యమంత్రికి సమాచారం అందినట్లు చెబుతున్నారు. రేపో, ఎల్లుండో ముఖ్యమంత్రి అధిష్టానం మేరకు చర్యలకు అవకాశం ఉందని అంటున్నారు.
ఓదార్పు యాత్రలో పాల్గొనవద్దని అధిష్టానం మాటగా రోశయ్య బాలినేని శ్రీనివాస రెడ్డికి చెప్పారు. ముఖ్యమంత్రి మాటను ఆయన బేఖాతరు చేశారు. తనపై వేటు పడినా వెనకాడేది లేదని, ఓదార్పు యాత్రలో పాల్గొంటానని ఒకటికి రెండు సార్లు బాలినేని శ్రీనివాస రెడ్డి చెప్పారు. జగన్ ఓదార్పు యాత్రలో ఆయన పాల్గొన్నారు కూడా. ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత కూడా వినకపోవడాన్ని సీరియస్ గా పరిగణిస్తూ చర్య తీసుకునేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఆ ఇద్దరు మంత్రులపై చర్య తీసుకోకపోతే మంత్రులు, శాసనసభ్యులు ముఖ్యమంత్రి మాట వినే పరిస్థితి ఉండదని, పరిస్థితి చేయి దాటిపోతుందని భావించి ఓ హెచ్చరికగా వారిద్దరిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.