నేడు విశేష పర్వదినం: తమిళనాడులోని ఆ ఆలయానికి పట్టువస్త్రాలు సమర్పించిన టీటీడీ
నేడు.. ఆడి కృతిక. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనకు అత్యంత విశిష్ట పర్వదినం. భక్తులు ఈ రోజును అత్యంత భక్తిశ్రద్ధలతో సుబ్రహ్మణ్యుడిని పూజిస్తారు. దక్షిణాదిలో.. ప్రత్యేకించి తమిళనాడు, కర్ణాటకల్లో ఈ పండగకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ పవిత్ర దినాన ఉపవాసాలు ఉండడం, కావడి మొక్కులు తీర్చుకోవడం, క్షీరాభిషేకాలు చేయడం ద్వారా కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.
ప్రతి ఏటా తమిళ మాసం 'ఆడి'లో వచ్చే కృత్తిక నక్షత్రం రోజున ఈ పండగను నిర్వహిస్తారు. కృత్తిక నక్షత్రం గురువారం సాయంత్రం 6:19 నిమిషాలకు ప్రారంభమైంది. ఈ సాయంత్రం 4:51 నిమిషాలకు ముగుస్తుంది. ఉదయాతిథి ప్రకారం.. నేడే ఈ పర్వదినాన్ని జరుపుకుంటోన్నారు. పురాణ కథల ప్రకారం శివ పుత్రుడైన కుమారస్వామిని ఆరుగురు కృత్తిక కన్యలు పెంచి పెద్ద చేశారు. వారి నిష్కల్మషమైన ప్రేమకు మెచ్చిన పరమశివుడు.. కృత్తిక నక్షత్రం రోజున కార్తికేయుడిని పూజించే భక్తులకు విశేష ఫలితాలు దక్కుతాయని వరం ఇచ్చాడు.

ఈ నేపథ్యంలోనే సంతానం లేని దంపతులు ఆడి కృతిక రోజున ఉపవాసం ఉండి.. సుబ్రహ్మణ్యస్వామివారి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ పర్వదినాన ఉదయాన్నే నిద్రలేచి, పవిత్ర స్నానమాచరించి పూజా మందిరాన్ని అలంకరించుకోవాలి. రోజంతా ఉపవాస దీక్షను పాటిస్తూ మురుగన్ ఆలయాలను సందర్శించడం విశేష ఫలాన్ని ఇస్తుంది. భక్తులు పాలు, పంచామృతం, చందనంతో స్వామివారికి అభిషేకాలు నిర్వహిస్తారు. ఆలయాల్లో కావడి మొక్కులు సమర్పించడం, పాల కుండలతో ప్రదక్షిణలు చేయడం ఈ పండగ ప్రత్యేకత.
ఇంట్లోనే పూజ చేసేవారు కంద షష్టి కవచాన్ని పఠించడం మంచిది. సాయంత్రం పూజ ముగిసిన తర్వాత స్వామివారికి చక్కెర పొంగలి, పండ్లు, నైవేద్యాలను సమర్పించి ఉపవాస దీక్ష విరమించాలి. ఈ ఏడాది ఆడి కృతిగై పర్వదినం శుక్రవారంతో కలిసి రావడం వల్ల అటు అమ్మవారి అనుగ్రహం, ఇటు కుమారస్వామి ఆశీస్సులు ఒకేసారి లభించి కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని భక్తుల నమ్మకం.
కాగా.. ఈ విశేష పర్వదినాన్ని పురస్కరించుకుని తమిళనాడులోని తిరుత్తణిలో వెలిసిన శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామివారికి తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి తరపున టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర పట్టు వస్త్రాలను సైతం సమర్పించారు. ఆలయానికి వచ్చిన టీటీడీ ఆధికారులకు తిరుత్తణి ఆలయ ఛైర్మన్ శ్రీధర్, జాయింట్ కమిషనర్ జానకి, బోర్డు సభ్యులు, ఇతర ఆధికారులు ఘనస్వాగతం పలికి పట్టు వస్త్రాలను స్వామివారికి అలంకరించారు.
ఆడికృతికను పురస్కరించుకుని శ్రీవారి తరఫున తిరుత్తణి సుబ్రమణ్యస్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించడం 2006 నుంచి ఆనవాయితీగా పెట్టుకుంది టీటీడీ. క్రమం తప్పకుండా ప్రతి ఆడికృతిక రోజునా పట్టు వస్త్రాలను సమర్పిస్తూ వస్తోంది. కృతిక నక్షత్రం ప్రారంభమైన సమయాన.. ఆ పట్టువస్త్రాలతోనే కుమారస్వామి విగ్రహాన్ని అలంకరిస్తారు. తిరుత్తణితో పాటు పళని, తిరుచెందూరు, స్వామి మలై, తిరుప్పారకుండ్రం, పాళముదిర్ చోళై వంటి చోట్ల ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.




Click it and Unblock the Notifications