వైయస్ జగన్ కు దూరమే, కాంగ్రెసుతోనే వైయస్ వివేకానంద రెడ్డి
తనను కాంగ్రెసు అధిష్టానం ఢిల్లీకి పిలిపించలేదని, తానే ఢిల్లీకి వెళ్లానని ఆయన చెప్పారు. సిఎల్పీ సమావేశం సందర్భంగా తాను గులాం నబీ ఆజాద్ ను, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి మంత్రి పదవి అడిగానని ఆయన చెప్పారు. తనంత తానే ఢిల్లీకి వెళ్లి సోనియా సలహాదారు అహ్మద్ పటేల్ ను, కేంద్ర మంత్రి ఎకె ఆంటోనీని కలిశానని, ఆ తర్వాత సోనియా గాంధీని కలిశానని ఆయన చెప్పారు. కాంగ్రెసు నాయకత్వంపై నిందలు రాకూడదనే తాను ఈ విషయాలన్నీ చెబుతున్నానని ఆయన అన్నారు. కాంగ్రెసు అధిష్టానం నీచ రాజకీయాలు చేస్తుందనే వైయస్ జగన్ లేఖలోని మాటలను ఆయన ఖండించారు.
ప్రజాసమస్యలపై చిత్తశుద్ధి ఉంది కాబట్టే కిరణ్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చిందని ఆయన చెప్పారు. తమ అన్నకు వైయస్సార్ కు కాంగ్రెసు పార్టీ దన్నుగా నిలిచిందని ఆయన అన్నారు. వైయస్ జగన్ కు తగిన సమయంలో అవకాశం ఇస్తామని కూడా కాంగ్రెసు అధిష్టానం చెప్పిందని ఆయన అన్నారు. అన్న బాటలోనే తాను కాంగ్రెసులో కొనసాగుతానని ఆయన చెప్పారు. ఉన్నత పదవులు కావాలనే ఆశ అందరికీ ఉన్నట్లుగానే తనకూ ఉందని, దాంట్లో తప్పేమీ లేదని ఆయన అన్నారు. నాయకత్వంపై వైయస్సార్ కు ఉన్న గౌరవం తనకు ఉందని ఆయన చెప్పారు.