భారీ వర్షాలతో రైతు కంట్లో నీళ్లు: వాయుగుండంగా అల్పపీడనం

పశ్చిమ గోదావరిలో 75 వేల ఎకరాల్లో వరి, మరో 25 వేల ఎకరాల్లో ఇతర పంటలు దెబ్బతిన్నాయి. వరంగల్లో లక్ష ఎకరాల్లో పంటకు నష్టం జరిగింది. కృష్ణా జిల్లాలో రూ.200 కోట్ల పంట నష్టం వాటిల్లింది. 2 లక్షల టన్నుల వరి ధాన్యం పనికి రాకుండా పోయే పరిస్థితి తలెత్తింది. ఖమ్మంలో 35 వేల హెక్టార్లలో పంట నష్టం జరిగింది. శ్రీకాకుళం, విజయనగరం, నల్లగొండ జిల్లాలూ విలవిల్లాడుతున్నాయి. కర్నూలు జిల్లాలో అన్ని రకాల పంటలకు తెగుళ్ల భయం పట్టుకుంది. మూడు లక్షల ఎకరాల్లో కోతలకు సిద్ధంగా వరికి ముప్పు ముంచుకొస్తోంది. నెల్లూరులో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. వాగులు, వంకలు పొంగుతున్నాయి. మొత్తంగా వర్షాల కారణంగా సుమారు 10 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతింది.
చలిగాలుల దెబ్బకు వృద్ధుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. చలిగాలులకు నెల్లూరు జిల్లాలో నలుగురు, కృష్ణాలో ముగ్గురు మరణించారు. హైదరాబాద్లో పగటిపూట సాధారణ ఉష్ణోగ్రత ఏకంగా 6 డిగ్రీలు తక్కువగా నమోదైంది. తిరుపతి, ఆదిలాబాద్లలోనూ పగటిపూట ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఇక... వర్షాల ప్రభావంతో ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున మరణించారు. గుంటూరు జిల్లా వినుకొండ మండలంలో ఒక సుమో వాగులో కొట్టుకుపోవడంతో 13 మంది గల్లంతయ్యారు. వాయుగుండం ప్రభావంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ నుంచి, ఆ తర్వాత హైదరాబాద్లో సమీక్ష జరిపారు. తక్షణమే సహాయ, పునరావాస చర్యలు చేపట్టాల్సిందిగా కలెక్టర్లను ఆదేశించారు. మరో 48 గంటలపాటు పూర్తి అప్రమత్తంగా ఉండాలని సంబంధిత జిల్లాల మంత్రులు, అధికారులకు సూచించారు. వాయుగుండ ప్రభావం అధికంగా ఉన్న నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. వాయుగుండం మంగళవారం రాత్రికి మచిలీపట్నానికి 150 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది బుధవారం ఉదయం ఒంగోలు - మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశముందని వాతావరణ అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications