గిన్నిస్ రికార్డు సృష్టించిన ఆంధ్ర నాట్యం కూచిపూడి
600 ఏళ్ల నాటి ప్రాచీన నాట్యానికి ప్రపంచ గుర్తింపు తీసుకురావడానికి సిలికానాంధ్ర చేస్తున్న కృషి ప్రశంసనీయమని ముఖ్యమంత్రి నల్లారి కిరణ్కుమార్రెడ్డి అన్నారు. మహా బృంద నాట్యం గిన్నిస్ పుటలకు ఎక్కడం ద్వారా ప్రపంచంలో రాష్ట్రానికి ఉన్నతమైన గౌరవం దక్కిందని, అందుకు కారణమైన ప్రతి ఒక్కరికీ అభినందనలను అందించారు. కూచిపూడి నాట్యానికి ప్రాణం పోసిన సిద్ధింద్రయోగికి నివాళిగా పద్మభూషణ్ వెంపటి చిన సత్యం హిందోళ రాగంలో రూపొందించిన 'థిల్లానా' నాట్యాన్ని ఏకకాలంలో 2,800 మంది కళాకారులు 10 నిమిషాలపాటు అభినయించారు. ఈ ప్రదర్శనను గిన్నిస్ సంస్థ ప్రపంచ రికార్డుగా గుర్తించింది. గిన్నిస్ ప్రతినిధి ఈ మేరకు ప్రదర్శన ముగిసిన అనంతరం ముఖ్యమంత్రికి ధ్రువపత్రాన్ని అందజేశారు. రెండో అంతర్జాతీయ కూచిపూడి సమ్మేళనం ముగింపు కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ భర్త దేవీసింగ్, గవర్నర్ సతీమణి విమలా నరసింహన్, ముఖ్యమంత్రి సతీమణి రాధికారెడ్డి, కేంద్రమంత్రి పురంధరేశ్వరి, మంత్రులు వట్టి, శ్రీధర్బాబు, డీకే అరుణ, నాట్య కుటుంబాలు, కళాప్రియులు పాల్గొన్నారు.