11న ఢిల్లీలో వైయస్ జగన్ దీక్ష: ఎమ్మెల్యేలు, ఎంపీలతో బల ప్రదర్శన
రైతు సమస్యలపై, కృష్ణా ట్రిబ్యునల్ తీర్పుపై ఈ నెల 11వ తేదీన కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడానికి నిరాహార దీక్ష చేస్తానని ఆయన చెప్పారు. ఈ దీక్షలో తనతో కలిసి వచ్చే శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, నాయకులు పాల్గొంటారని ఆయన చెప్పారు. తన దీక్షతో కేంద్ర ప్రభుత్వం దిగి రాక తప్పదని ఆయన అన్నారు. తన దీక్షతోనైనా ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ రైతు సమస్యలపై దిగి వస్తారని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. పోలవరం ప్రాజెక్టును, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పూర్తి చేయాలని వైయస్సార్ తలపెట్టారని, కానీ సిగ్గులేని కేంద్ర ప్రభుత్వం వాటిని పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. ఒంటరి చేసి తనను పార్టీ నుంచి పంపించే పరిస్థితి కల్పించారని, ఒంటరిగా బయటకు వచ్చినా ప్రజల ఆదరాభిమానాలతో చిరునవ్వుతో మనగలుగుతున్నానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ పాల్గొన్నారు.