ఆంధ్రప్రదేశ్ విభజన ఖాయమా, నివేదిక తర్వాతా మారని స్థితి?

Srikrishna Committee
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ విభజన ఖాయమనే ప్రచారం ఒక వైపు నుంచి జరుగుతోంది. శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన ఆరు ప్రత్యామ్నాయాలు ఒక రకంగా తెలంగాణకు అనుకూలంగా ఉన్నాయని అంటున్నారు. పూర్తిగా తెలంగాణకు అనుకూలంగా నివేదిక లేకపోయినప్పటికీ వివిధ రంగాల్లో అన్యాయానికి గురయ్యామనే భావన తెలంగాణ ప్రజల్లో ఉందని చెప్పింది. అందుకుగాను, సమైక్యాంధ్ర ప్రదేశ్‌ను కొనసాగిస్తూ తెలంగాణ కోసం చట్టబద్దమైన ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేయాలని సూచించింది. నిధుల సమీకరణ, వ్యయం ఈ మండలి ద్వారా జరగాలని సూచించింది.

దీన్ని బట్టి తెలంగాణకు అన్యాయం జరిగిందనే వాదనను తమ వాదనను శ్రీకృష్ణ కమిటీ అంగీకరించిందని అంటున్నారు. శ్రీకృష్ణ కమిటీ చేసిన ఆరు సిఫార్సుల్లో ఏదో ప్రత్యామ్నాయం తప్ప మిగతావేవీ ప్రత్యామ్నాయాలు కాలేవని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు సహా తెలుగుదేశం, కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు అంటున్నారు. సీమాంధ్రకు కొత్త రాజధానిని ఏర్పాటు చేస్తూ, హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనేది ఆ ప్రత్యామ్నాయం. అయితే, కాస్తా సరిహద్దులు మార్చవచ్చునని చెప్పింది.

ప్రాంతీయ బోర్డు అనేది కొత్తదేమీ కాదు. పెద్ద మనుషుల ఒప్పందం, ఆరు సూత్రాల పథకం, 610 జీవో వంటి పలు గ్యారంటీలు ఏవీ తెలంగాణ విషయంలో అమలు కాలేదు. ప్రాంతీయ బోర్డు గాలిలో కలిసిపోయింది. అందువల్ల గ్యారంటీలు, చట్టబద్ధతలు తమకు వద్దని, తెలంగాణ రాష్ట్రం మాత్రమే కావాలని తెలంగాణవాదులు గట్టిగానే వాదిస్తున్నారు. దీంతో శ్రీకృష్ణ కమిటీ నివేదిక తర్వాత కూడా రాష్ట్రంలో పరిస్థితి మారలేదు.

తమ నివేదిక సర్వరోగ నివారిణిలా ఉంటుందని శ్రీకృష్ణ కమిటీ సభ్యులు చెప్పుకున్నారు. కానీ, కమిటీ కచ్చితంగా ఏమీ తేల్చలేదు. పైగా, కొత్త సమస్యలు తెచ్చిపెట్టింది. రాయల తెలంగాణ, కొన్ని జిల్లాల్లోని ప్రాంతాలతో కలిపి హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయడం వంటివి కొత్త సమస్యలు. శ్రీకృష్ణ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి ఏడాది పాటు కాలయాపన చేయడానికి అవకాశం కల్పించిందనే అభిప్రాయం ఉంది. సమైక్యాంధ్రను డిమాండ్ చేస్తున్న సీమాంధ్ర నాయకులు కమిటీ నివేదిక పట్ల పూర్తి సంతోషంతో లేరు. హైదరాబాద్ చుట్టు మాత్రమే కమిటీ నివేదిక తిరిగినట్లు అనిపిస్తోంది. హైదరాబాదును తెలంగాణ నుంచి వేరు చేసి చూడడం అనేది చారిత్రకంగానే సాధ్యం కాదని తెలంగాణవాదులు అంటున్నారు.

తెలంగాణ కోసం మళ్లీ ఉద్యమాలు ఊపందుకునే పరిస్థితినే కల్పించింది. కమిటీ నివేదికపై అఖిల పక్ష సమావేశాలు ఏర్పాటు చేయడం కూడా అనవసరమనే అభిప్రాయం బలంగా ఉంది. కమిటీ నివేదికపై, దాని ప్రత్యామ్నాయాలపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిందే. తెలంగాణకు అనుకూలంగా, వ్యతిరేకంగానా అనేది కేంద్ర ప్రభుత్వ ఇష్టం. రెండు విధాలుగా తీసుకోవడానికి కమిటీ అవకాశం కల్పించింది. అయితే, తెలంగాణకు కొన్ని గ్యారంటీలు కల్పించాలని అభిప్రాయపడింది. ఆ గ్యారంటీలకు సీమాంధ్ర నాయకులే కాదు, తెలంగాణ నాయకులు కూడా అంగీకరించరు. అందువల్ల కమిటీ ఏర్పాటుకు ముందున్న పరిస్థితే, ఇప్పుడు కూడా ఉంటుందనేది తెలిసిపోతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+