శ్రీకృష్ణ కమిటీ నివేదిక తేల్చిందేమిటి, ఎవరికి అంగీకారయోగ్యం?

శ్రీకృష్ణ కమిటీ నివేదిక చేసిన సిఫార్సులు దాదాపుగా వివిధ ప్రాంతాల నాయకులు చేస్తున్న డిమాండ్లను సిఫార్సులుగా సూచించింది. అయితే, తాను సూచించిన ప్రత్యామ్నాయాలకు శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన వివరణ, విశ్లేషణలకు మాత్రమే ప్రాధాన్యం చేకూరే అవకాశం ఉంది. కమిటీ చేసిన ఐదు సూచనల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండుగా విభజించాలనే సిఫార్సును మాత్రమే తెలంగాణవాదులు అంగీకరించే అవకాశం ఉంది. 1956కు ముందు పరిస్థితులే తెలంగాణలో ఇప్పటికీ ఉన్నాయని, తెలంగాణ అభివృద్ధి విషయంలో అన్యాయం జరిగిందని శ్రీకృష్ణ కమిటీ నివేదిక చేసిన విశ్లేషణ మాత్రమే ప్రధానమైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్కు ఇదే ప్రాతిపదిక అవుతుంది. వెనకబాటు అనేది రాష్ట్ర విభజనకు ప్రాతిపదిక కాదని చెప్పిన విషయం ఇక్కడ ప్రాధాన్యాన్ని సంతరించుకోదు. విలీనానికి ముందు ఒక విడి రాష్ట్రంగా ఉన్న పరిస్థితే ఇప్పటికీ ఉందనేది రాష్ట్ర ఏర్పాటు డిమాండ్కు ప్రాధాన్యం చేకూరుతుంది.
తెలంగాణతో తమ ప్రాంతాన్ని కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని రాయలసీమ నాయకులు కోరుతున్నారు. దీన్ని తెలంగాణవాదులు, తెలంగాణ రాష్ట్ర సమితి అంగీకరించే అవకాశం లేదు. విద్య, నీటిపారుదల, సాధారణ అభివృద్ధి కోసం మూడు ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేసి దానికి రాజ్యాంగ బద్ధత కల్పించి, నిధుల సమీకరణా వ్యయం ఆ బోర్డుల ద్వారా చేయాలనే సూచన కూడా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు డిమాండ్కు న్యాయబద్ధత చేకూరుస్తుంది. అయితే, ఈ సూచనకు సీమాంధ్ర నాయకులు అంగీకరించే అవకాశం లేదు. తెలంగాణవాదులు కూడా దీనికి అంగీకరించరు. గత 50 ఏళ్ల కాలంలో వివిధ సందర్భాల్లో తెలంగాణ కోసం కల్పించిన రాజ్యాంగబద్ధ పరిరక్షణలు ఏవీ అమలు కాలేదు. వాటిని క్రమక్రమంగా నీరు గారుస్తూ వచ్చారు. అందువల్ల ప్రాంతీయ బోర్టుల ఏర్పాటుకు కూడా తెలంగాణవాదులు అంగీకరించబోరు.
హైదరాబాద్, నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్నగర్లతో కలిపి కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయడమనే సిఫార్సును తెలంగాణవాదులు ఏ మాత్రం అంగీకరించరు. హైదరాబాదునే కేంద్రపాలిత ప్రాంతంగా చేయడానికి ఇష్టపడని వీరు మరో మూడు జిల్లాలను కూడా కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తామంటే ఏ మాత్రం అంగీకరించరు. యథాతథ స్థితిలో సమైక్య రాష్ట్రంగానే ఉంచాలనే శ్రీకృష్ణ కమిటీ సిఫార్సుకు అర్థమే లేదు. సమస్యంతా అక్కడే మొదలైనప్పుడు అలాగే ఉంచమనడంలో ఏ విధమైన హేతుబద్ధత లేదు. మిగిలింది, తెలంగాణ, కోస్తాంధ్ర రాష్ట్రాలుగా విభజించడమనే సిఫార్సు మాత్రమే ఇప్పుడు ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వల్లనే ఒకే పార్టీలో రెండు అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీనివల్లనే శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. అందువల్ల శ్రీకృష్ణ కమిటీ దాదాపు ఏడాది పాటు కాలక్షేపం చేసిందని చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications