ఆరు ఆప్షన్లు ఇచ్చిన శ్రీకృష్ణ, బడ్జెట్ సమావేశాల్లోగా కేంద్రం నిర్ణయం
శ్రీకృష్ణ కమిటీ నివేదిక సిఫార్సులపై పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోగానే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని సమాచారం. ఫిబ్రవరిలో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఆరు ఆప్షన్లను చారిత్రక నేపథ్యంలో అధ్యయనం చేసి ఏ ఒక్కదానికో సిఫార్సు చేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం, ఏర్పాటు చేయకుండా ఉండడం అనే అంశాలపై తన అభిప్రాయాలను శ్రీకృష్ణ కమిటీ వెల్లడించినట్లు సమాచారం. ప్రస్తుత స్థితిలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కొనసాగించడం లేదంటా హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం అనే ఆప్షన్లను కమిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణ జిల్లాలు మాత్రమే వెనకబడి ఉన్నాయని చెప్పడానికి ఏ విధమైన భౌతిక ప్రాతిపదిక లేదని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సామాజిక, ఆర్థిక కొలమానాలను బట్టి చెప్పవచ్చునని కమిటీ తేల్చినట్లు తెలుస్తోంది.