తెలంగాణ తప్ప మరేదీ వద్దని ప్రణబ్ ముఖర్జీకి చెప్పిన తెలంగాణ ఎంపీలు
బుధవారం సమావేశాన్ని బట్టిచూస్తే అధిష్ఠానం నిర్ణయం కోసం మరికొంత కాలం వేచిచూడక తప్పదన్న భావన కలిగినట్లు ఒక ఎంపీ వ్యాఖ్యానించారు. వాళ్లు కూడా అయోమయంలో పడ్డారన్న భావన కల్గిందన్నారు. సమావేశంలో పాల్గొన్న ఎంపీలంతా శ్రీకృష్ణ కమిటీని తీవ్రంగా తప్పుబట్టినట్లు తెలిసింది. నివేదిక అంతా తప్పులతడకగా ఉందని, ఎవరో ఇచ్చిన డేటాను కనీసం పరీక్షించకుండా అందులో చేర్చారని నివేదించారు. ప్రణబ్ స్పందిస్తూ, నివేదిక మొత్తం చదివి ఎక్కడెక్కడ తప్పులున్నాయో తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. క్రమశిక్షణ రేఖను కేవలం తెలంగాణ ఎంపీలకే వర్తింపజేస్తే సరిపోదని, సీమాంధ్ర ఎంపీలకూ గీయాలని వీహెచ్, సర్వే సత్యనారాయణలు కోరినట్లు సమాచారం. ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ ప్రజల నుంచి ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా తామంతా పార్టీకి కట్టుబడి ఉన్నామని, అదే సీమాంధ్ర ప్రాంతంలో ఒక వ్యక్తి కోసం ఇద్దరు ఎంపీలు బాహాటంగా పార్టీని ధిక్కరిస్తున్నా ఎవ్వరూ పట్టించుకొనే పరిస్థితి లేదని వీహెచ్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. డిసెంబర్ తొమ్మిదో తేదీ ప్రకటన తర్వాత తెలంగాణ అంశం పూర్తిగా ప్రజల్లోకి వెళ్లినందున తమ చేతుల్లో ఏమీ లేదని, తాము పార్టీకి విశ్వాసపాత్రంగా ఉన్నా పార్టీ మనగలిగే పరిస్థితి ఉండదని సర్వే వ్యాఖ్యానించారు. జగన్ గురించి భయపడాల్సిన పనేలేదని, గత మున్సిపల్ ఎన్నికల్లో తన నియోజకవర్గంలో అతను ప్రచారం చేసిన చోట ఒక్కసీటు కూడా గెలవలేదని సర్వే ఉదహరించారు.
రాష్ట్ర విభజనకు వెళ్తే సీమాంధ్రలో ప్రతిష్ఠంభన వస్తుందనేది కేవలం కల్పితం మాత్రమేనని, డిసెంబర్ తొమ్మిది ప్రకటన తర్వాత జగన్, కేవీపీలు అప్పట్లో స్పీకర్ గదిలో కూర్చొని రాజీనామాల డ్రామా నడిపించారని ఆరోపించారు. రాష్ట్ర విభజనకు వెళ్తే సీమాంధ్రలో ప్రతిష్ఠంభన ఉంటుందో లేదో తెలుసుకోడానికి స్వతంత్ర సర్వే చేయించుకోవాలని సూచించారు. కొన్ని రోజుల పాటు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా పెట్టండి అని కూడా సూచించినట్లు తెలిసింది. కమిటీ నివేదిక ఎలాఉన్నా చివరకు రాజకీయ నిర్ణయమే తీసుకోవాలని మధుయాస్కీ గట్టిగా చెప్పినట్లు సమాచారం. తమతో మరోసారి భేటీ అవుతామని అధిష్టానం పెద్దలు కాంగ్రెసు తెలంగాణ ప్రాంత ఎంపీలకు చెప్పారు.