అనిల్ అంబానీకి చెందిన రెండు కంపెనీలను బహిష్కరించిన సెబీ
అంతే కాకుండా, ఈ రెండు సంస్థలు అక్రమమైన మార్కెట్ లావాదేవీలకు పాల్పడ్డట్టు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తును పరిష్కరించేందుకు రూ.50 కోట్లను సెటిల్మెంట్ ఛార్జిగా విధించింది. అయితే మ్యూచువల్ ఫండ్లు, ప్రైమరీ మార్కెట్ ఇష్యూలు, తిరిగి కొనుగోళ్లు (బై-బ్యాక్), ఓపెన్ ఆఫర్ల విషయంలో ఈ నిరోధం వర్తించదు. సెబీ ఉత్తర్వులో పేర్లు ఉన్న ఇతర అధికారులలో ఆర్- ఇన్ఫ్రా వైస్ ఛైర్మన్ సతీశ్ సేథ్, ముగ్గురు డైరెక్టర్లు ఎస్.సి.గుప్తా, లలిత్ జలాన్, జె.పి.చలసానిలు ఉన్నారు.
ఈ కేసుకు అనిల్ అంబానీ గ్రూపునకు చెందిన సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్) షేర్లలో సాగిన వ్యవహారాలపై సెబీ జరిపిన దర్యాప్తుతో సంబంధం ఉంది. విదేశీ పెట్టుబడి నియమాలను ఉల్లంఘించారని, అనుచిత వ్యాపార ధోరణులకు ఒడిగట్టారని వచ్చిన ఆరోపణలపై సెబీ దర్యాప్తు జరిపింది. తాను చెప్పిన కొన్ని షరతులు, నిబంధనలకు కట్టుబడతామని రెండు కంపెనీలు అంగీకరించడంతోనూ, సెటిల్మెంట్ ఛార్జీలను చెల్లించడానికి సిద్ధపడటంతోనూ కేసును పరిష్కరించడానికి ముందుకువచ్చినట్లు శుక్రవారం సమ్మతి ఉత్తర్వులో సెబీ స్పష్టం చేసింది.
పరిష్కార షరతుల ప్రకారం - ఆర్-ఇన్ఫ్రా, ఆర్ఎన్ఆర్ఎల్లు సెకండరీ మార్కెట్లో నమోదైన ఏ కంపెనీ షేర్లలోనూ.. మ్యూచువల్ ఫండ్లు తప్ప.. 2012 డిసెంబరు వరకు పెట్టుబడి పెట్టజాలవు. కేసులో ప్రస్తావించిన వ్యక్తులు ఈ ఏడాది డిసెంబరు వరకు మార్కెట్లో పెట్టుబడులు పెట్టజాలరు. సెబీ ఉత్తర్వుపై ఆర్- ఇన్ఫ్రా ప్రతినిధి మాట్లాడుతూ ''రిలయన్స్ ఇన్ఫ్రా పైనా, కంపెనీ డైరెక్టర్లపైనా సెబీ గత జూన్లో జారీ చేసిన షో-కాజ్ ప్రొసీడింగ్స్ను ఆర్-ఇన్ఫ్రా స్వచ్ఛందంగా పరిష్కరించుకొంద''న్నారు.
సమ్మతి పద్ధతి ప్రకారం ఈ సెటిల్మెంట్ నేరాన్ని అంగీకరించకుండానూ, ఖండించకుండానూ జరిగింది. అవాంఛనీయమైన, కాలయాపనకు దారి తీసే దావా విషయంలో పూర్వ చర్య తీసుకోవడానికి, మదుపరుల ప్రయోజనాలను పరిరక్షించడానికి సెటిల్మెంట్ జరిగిందని వివరించారు. మొత్తం సెటిల్మెంట్ ఫీజును డైరెక్టర్లు వారంతట వారు చెల్లించారని కంపెనీ తెలిపింది.