జగన్తో దోస్తీ, సీమాంధ్రకు సానుకూలం, అందుకే మొయిలీకి ఉద్వాసన?
గతంలో మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్కు అనుకూలంగా వ్యవహరిస్తూ సమస్యను జఠిలం చేసింది వీరప్ప మొయిలీనే అనే అభిప్రాయం ఉంది. మొయిలీ అండదండలతోనే జగన్ రెచ్చిపోతూ వచ్చారని చెబుతారు. జగన్కు అనుకూలంగా వ్యవహరిస్తూ వాస్తవాలను మొయిలీ దాచి పెడుతూ వచ్చారని సోనియా భావించినట్లు సమాచారం. ఈ విషయం నిర్ధారణకు రాగానే నేరుగా తన రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ను రంగంలోకి దింపినట్లు సమాచారం.
ఆ తర్వాత తెలంగాణ అంశం విషయంలోనూ వీరప్ప మొయిలీ సరిగా వ్యవహరించలేదనే విమర్శలున్నాయి. పార్టీని ఒక్క తాటిపై నడిపించడంలో, విభేదాలను రూపుమాపడంలో ఆయన విఫలమయ్యారని అంటారు. ఆయన సీమాంధ్ర నాయకులకు అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చారనే విమర్శలున్నాయి. మొయిలీపై కాంగ్రెసు తెలంగాణ నాయకులు బహిరంగ విమర్శలు కూడా చేసిన సందర్భాలున్నాయి. రాష్ట్ర రాజకీయాల పట్ల, పార్టీ వ్యవహారాల పట్ల గులాం నబీ ఆజాద్కు మంచి అవగాహన ఉందనే విషయం అందరికీ తెలుసు. రాష్ట్రంలోని కాంగ్రెసు పార్టీ నాయకులతోనే కాకుండా ఇతర పార్టీల నాయకులతో కూడా ఆయనకు మంచి సంబంధాలున్నాయి.
2004 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో పొత్తు కుదుర్చడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి చెప్పినా వినకుండా కాంగ్రెసుకు విజయ మార్గం వేసి పెట్టారని అంటారు. రాష్ట్ర కాంగ్రెసు పరిస్థితి గందరగోళంగా ఉన్న స్థితిలో గులాం నబీ ఆజాద్కు బాధ్యతలు అప్పగించడం వల్ల సమస్య పరిష్కారం సులభమవుతుందని సోనియా భావించినట్లు చెబుతున్నారు. తెలంగాణ సమస్య పరిష్కారానికి గులాం నబీ ఆజాద్ ఓ పరిష్కారాన్ని కనుక్కుంటారనే ఆశతో ఆమె ఉన్నట్లు చెబుతున్నారు.
సీమాంధ్ర, తెలంగాణ నాయకుల మధ్య సయోధ్యను కుదిర్చే పనిని కూడా చేయగల సామర్థ్యం ఆయనకు ఉందని అంటున్నారు. కాగా, తెలంగాణ ఉద్యమం విషయంలో దూకుడుగా చేసిన ప్రకటన వల్లనే కేశవ రావును పక్కన పెట్టినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రాంతీయ ఉద్యమాలు జోరుగా సాగుతున్నందు వల్ల ఎవరికి పార్టీలో ప్రధాన స్థానం కల్పించినా వివాదం చెలరేగుతుందనే ఉద్దేశంతో ఆమె ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, పూర్తి విధేయులుగా ఉన్న వి. హనుమంతరావుకు, పొంగులేటి సుధాకర్ రెడ్డికి మాత్రం పదవులు కాదనలేకపోయారని చెబుతున్నారు.