వివేకానంద వెంటనే క్షమాపణ చెప్పాలి: లోక్సత్తా అధ్యక్షుడు జెపి
సభా గౌరవాన్ని కాపాడడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, స్పీకరు నాదెండ్ల మనోహర్ పాటుపడాలన్నారు. ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం కాకుండా ప్రజల పక్షాన పోరాడాలన్నారు. అందరూ మౌనంగా ఉండి కొంతమంది దుశ్చర్యలను చూస్తూ ఊరుకుంటే బలయ్యేది 294 మంది శాసనసభ్యులు మాత్రమే కాదని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజలన్నారు. నాయకత్వం అనేది దూరదృష్టి, విజ్ఞతతో, ప్రజలను కాపాడాలనే ఉద్దేశ్యంతో ఉండాలన్నారు. ఈ సంఘటనను తాను ఖండిస్తున్నట్టు చెప్పారు. శాసనసభపై గౌరవం పోయేలా సభ్యులు ప్రవర్తించారన్నారు. రాజకీయంగా పైచేయి సాధించుకోవడానికే పార్టీలు వ్యూహాలు చేస్తున్నాయి. కానీ ప్రజల సమస్యలపై దృష్టి సారించడం లేదన్నారు.
ఆయనకు ఇంత కోపం రావడానికి గల కారణాలు ఏమిటో అర్థం కావటం లేదని సిపిఎం శాసనసభా పక్ష నేత గుండా మల్లేష్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి దోషి కాకుంటే హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. ప్లకార్డులు చించి వేయడం, ప్రతిపక్ష సభ్యులను గల్ల పట్టి నెట్టివేయడం, దుర్భాషలాడటం మంత్రి రౌడీయుజం చేసినట్టుగా వ్యవహరించారన్నారు. ఇది డిప్యూటీ స్పీకర్ కళ్లముందే జరిగిందన్నారు. రౌడీలా ప్రవర్తించిన వైయస్ వివేకాను ఆరేళ్లు శాసనసభకుగానీ, శాసనమండలికిగానీ రాకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అధికార పార్టీ చర్యల వల్ల ఈ సమావేశాలలో ఒక్క ప్రజా సమస్య కూడా చర్చకు రాలేదన్నారు.