కడపలో వైయస్ జగన్ గెలిచినట్లే, కాంగ్రెసు నేతల అంచనాలూ అవే
ఇక లగడపాటి రాజగోపాల్ మాత్రం నేరుగానే జగన్ విజయం సాధిస్తారని చెబుతున్నారు. లగడపాటి సర్వేలు ఇటీవలి కాలంలో కచ్చితంగా ఉంటున్న విషయం తెలిసిందే. కడప ఎన్నికల్లో జగన్ విజయం ఖాయమని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పరోక్షంగా అంగీకరించారు. కడప పార్లమెంటు ఎన్నికలో డబ్బు, పులివెందులలో సానుభూతి గెలుస్తున్నాయని రాజగోపాల్ చెప్పారు. పోలింగ్ సరళిని బట్టి తమకందిన ప్రాథమిక అంచనాల ప్రకారం పార్లమెంటు అభ్యర్థి మెజారిటీ దాదాపు మూడు లేదా నాలుగు లక్షలు ఉండవచ్చన్నారు. ఓటుకు రెండువేల చొప్పున పంచారని ఆరోపించారు. నాయకులకైతే స్థాయిని బట్టి 10 లక్షల నుంచి కోటి వరకు ఇచ్చారని చెప్పారు.
డబ్బు, ప్రలోభాలు ఎన్నికల్లో ప్రధానపాత్ర పోషించాయని లగడపాటి చెప్పారు. ప్రజల మనోభావాలు తెలుసుకోడానికి తాను వివిధ దశలలో సర్వే చేయించానని, డబ్బు ప్రభావం ఎక్కువగా ఉండటంతో సర్వే ఫలితాలు సక్రమంగా రాలేదని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యం ఏమీ లేదని, ఎన్నికల సంఘమే అందుకు బాధ్యత వహించాలని చెప్పారు. ఇందిరమ్మ పాలనను సాగనంపి, ఆర్ఎస్ఎస్ పాలన తేవడం ఎవరివల్లా కాదన్నారు. కడప ఎన్నికలో రెండోస్థానం కాంగ్రెస్, టీడీపీలలో ఎవరిదన్నది అప్పుడే చెప్పలేనన్నారు. పులివెందులలో మాత్రం టీడీపీది మూడోస్థానమేనని లగడపాటి చెప్పారు.