చిరంజీవికి అధిష్టానం మెగా ఆఫర్: ఢిల్లీకి రమ్మని కాంగ్రెసు పిలుపు
చిరంజీవి ఢిల్లీ పర్యటనలో అనేక రాజకీయ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసు పార్టీలో విలీనం చేసే బహిరంగ సభను ఏర్పాటు చేయడంతో పాటు పీఆర్పీని మంత్రివర్గంలో చేరే అంశంపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. విలీన సభకు సోనియాగాంధీని కూడా చిరంజీవి ఆహ్వానించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే చిరంజీవిని ఢిల్లీ పిలిపించడం వెనుకు మరో కోణం కూడా ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ నెల 13న కడప, పులివెందుల ఉప ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రజల దృష్టి అటు పడకుండా ఉండటానికే చిరంజీవిని ఢిల్లీకి రమ్మని ఉంటారని అంటున్నారు.
చిరంజీవి ఢిల్లీ పర్యటనలో మంత్రివర్గ విస్తరణ, విలీనంతో పాటు చిరంజీవికి ఇచ్చే పదవిపై కూడా అధిష్టానం ఓ నిర్ణయం తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. అయితే రాష్ట్రంలో చిరుకు ఏదైనా ముఖ్య పదవి కట్టబెడితే సీనియర్లు ఊరుకుండే పరిస్థితి లేదు కాబట్టి సిడబ్లుసిలోకి తీసుకునే అవకాశం ఉందని ఇప్పటికే వార్తలు వచ్చాయి.