లాంఛనం పూర్తి, తెలుగుదేశం నుంచి నాగం జనార్దన్ రెడ్డి సస్పెన్షన్
చంద్రబాబు అధ్యక్షతన ఆయన నివాసంలో జరిగిన ఈ సమావేశంలో ఆ ముగ్గురు నేతలతో పాటు, దాడి వీరభద్రరావు, కడియం శ్రీహరి, శిద్దా రాఘవరావు, ఉప్పులేటి కల్పన తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో నాగంపై చర్య విషయం, పార్టీ కార్యాలయం, ఎమ్మెల్యేల నివాసాలపై జరిగిన దాడుల గురించి చర్చించారు. నాగంపై చర్య తీసుకోవాలంటూ తెలుగుదేశం తెలంగాణ ఫోరం చేసిన తీర్మానంపైనా చర్చ జరిపారు. సమావేశానికి హాజరైన వారంతా నాగంపై చర్య తీసుకోవాలని స్పష్టం చేయడంతో నాగంను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని పొలిట్బ్యూరో నిర్ణయం తీసుకుంది.
అనంతరం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నాగం సొంత జిల్లా మహబూబ్నగర్కే చెందిన పి.చంద్రశేఖర్ ముదిరాజ్ ఒక ప్రకటన విడుదల చేశారు. ''తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడిగా, ఎమ్మెల్యేగా ఉన్న నాగం జనార్దనరెడ్డి పార్టీకి నష్టం కలిగించే విధంగా వ్యవహరించారు. పార్టీపైన, అధినేతపైన, పార్టీ కార్యాలయంపైనా, సహచర నేతలు, నాయకుల పట్ల ఆయన ప్రవర్తించిన తీరు, చేసిన వ్యాఖ్యలను క్రమశిక్షణ రాహిత్యంగా భావించి ఈరోజు నుంచి ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో నిర్ణయించింది'' అని ఆ ప్రకటనలో వివరించారు.