తెలంగాణలో చాప కింద నీరులా వైయస్ జగన్ పాగా
తెలంగాణలోని అన్ని జిల్లాలకు ఆయన అడ్హాక్ కమిటీ కన్వీనర్లను నియమించారు. దీన్నిబట్టి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి చాలా మంది ముందుకు వస్తున్నారనేది అర్థమవుతోంది. కరీంనగర్ జిల్లా కమిటీ కన్వీనర్గా నియమితుడైన ఆది శ్రీనివాస్ ఇటీవలే పార్టీలో చేరారు. ఆదిలాబాద్ జిల్లా నుంచి ఇంద్రకరణ్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. తెలంగాణకు అనుకూలంగా వైయస్ జగన్ నిర్ణయం తీసుకుంటే మరింత మంది నాయకులు ఆయన వెంట నడిచే అవకాశం ఉంది. మహబూబ్ నగర్ జిల్లాలోని స్వతంత్ర శాసనసభ్యుడు రాజేశ్వర్ రెడ్డి జగన్కు మద్దతు ప్రకటించారు.
నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జగన్ వెంట నడుస్తారని కాంగ్రెసు సీనియర్ నాయకుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అన్నారు. కాంగ్రెసు అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆర్. దామోదర్ రెడ్డి కూడా జగన్ వైపు వెళ్తారని అంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో వెంకటరమణా రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వచ్చారు. రంగారెడ్డి జిల్లాలోని పలువురు కాంగ్రెసు నాయకులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. సికింద్రాబాద్ శాసనసభ్యురాలు జయసుధ జగన్ వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నారు. దాదాపుగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ వైయస్ జగన్ తన వైపు వచ్చే నాయకులను గుర్తించినట్లు చెబుతున్నారు.