రాకీయాల్లో కుక్కల రాజ్యం, నేతల మాటలన్నీ వాటి చుట్టే
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శానససభ్యుడు కెటి రామారావు తెలుగుదేశం నాయకులను తిడుతూ - రేబిస్ వ్యాధి సోకిన కుక్కల కన్నా హీనంగా, ఊరకుక్కల్లా మొరుగుతున్నారని విమర్శించారు. తనను తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయడాన్ని తప్పు పడుతూ నాగం జనార్దన్ రెడ్డి - చంద్రబాబు తనపై కుక్కలను ఉసిగొలిపి దుమ్ము పోస్తున్నాడని అన్నారు. తనపై విమర్శలు చేసిన తెలుగుదేశం తెలంగాణ ఫోరం సభ్యులను ఆయన కుక్కలుగా అభివర్ణించారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా కుక్కలను ప్రస్తావించారు. మహానాడులో ప్రసంగిస్తూ కాంగ్రెసు నాయకులను ఆయన కుక్కలుగా అభివర్ణించారు. కాంగ్రెసు కుక్కలు ఎవరిని పడితే వారిని కరిచే పరిస్థితి ఉందని అన్నారు. పిచ్చికుక్కలు కరిస్తే ఆస్పత్రుల్లో మందులు లేవని ఆయన విమర్శించారు. కుక్క కరిస్తే మనిషికి పిచ్చెక్కుతోందని, ఆ మనిషి తన భార్యను కరిస్తే ఆమెకూ ఆ వ్యాధి సోకుతోందని, కుక్కలను చూస్తే మనుషులు భయపడే పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు. మంత్రి శంకరరావు గురించి చెప్పాలంటే - తన ప్రత్యర్థులను ఆయన పిచ్చికుక్కలుగా అభివర్ణించారు.