స్పీకర్ ఎన్నిక: ఎమ్మెల్యే బాధ్యత మంత్రులపై పెట్టిన సిఎం కిరణ్

శాసనసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక విషయంలో కాంగ్రెసు పార్టీకి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కనిపించడం లేదు. అవిశ్వాస తీర్మానం విషయంలో తప్ప స్పీకర్ ఎన్నికపై తెలుగుదేశం పార్టీకి సహకరించేందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన శానససభ్యులు సిద్ధంగా లేరు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవికి పోటీ పెట్టవద్దని వారు తెలుగుదేశం పార్టీని కోరారు కూడా. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నుంచి కూడా అధికార కాంగ్రెసు పార్టీకి ఏ విధమైన ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు లేవు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికలో పాల్గొనకూడదని తెరాస నిర్ణయించుకుంది. ఓటింగుకు దూరంగా ఉండాలని కూడా అనుకుంటోంది. కాగా, తమ పార్టీ శాసనసభ్యులకు కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పి) శుక్రవారం విప్ జారీ చేసింది.
స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక రేపు శనివారం 11 గంటలకు జరుగుతుంది. ఉదయం 9 గంటల వరకు శాసనసభలో అందుబాటులో ఉండాలని సిఎల్పి తమ శాసనసభ్యులను ఆదేశించింది. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికపై, అవిశ్వాస తీర్మానంపై చర్చించేందుకు శుక్రవారం రాత్రి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ ముఖ్య నేతలతో, మంత్రులతో సమావేశం ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి స్పీకర్ పదవికి కెఇ కృష్ణమూర్తి, డిప్యూటీ స్పీకర్ పదవికి సుద్దాల దేవయ్య నామినేషన్లు దాఖలు చేశారు.












Click it and Unblock the Notifications