హస్తానికి హాండ్: వైయస్ జగన్తో వెళ్లే వారెందరో?
పిఆర్పీ నుండి ఇప్పటికే శోభా నాగిరెడ్డి జగన్ వర్గంలో చేరిపోయారు. మరో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సైతం జగన్ వర్గంలో చేరి మళ్లీ తిరిగి చిరంజీవి వద్దకు వచ్చారు. ఇక తెలుగుదేశం పార్టీ నుండి మంత్రాలయం బాలనాగిరెడ్డి జగన్ పంచన చేరిపోయారు. మిగిలిన ముగ్గురిలో ఎవరూ జగన్ వైపు వెళ్లకుండా టిడిపి కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. కాంగ్రెసు పార్టీ నుండి కాటసాని రాంభూపాల్ రెడ్డి జగన్తో దాదాపు వెళ్లడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎస్వీ మోహన్ రెడ్డి సైతం జగన్ వైపు వెళ్లడానికి తట్టాబుట్టా సర్దుకున్నట్లుగా సమాచారం. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే కాంగ్రెసులోనే ఉన్నప్పటికీ ఆయన తనయుడు జగన్ మాత్రం జగన్ పార్టీలో కీలకంగా ఉన్నారు.
ఆలూరు ఎమ్మెల్యే నీరజారెడ్డి జగన్ చేసిన పలు దీక్షలలో పాల్గొని ఆయన వర్గంలో ఎప్పుడో చేరి పోయినప్పటికీ ఆ తర్వాత మళ్లీ వెనుదిరిగి కాంగ్రెసు కండువా వేసుకుంది. నందికొట్కూరు ఎమ్మెల్యే సైతం గోపిలా ఉన్నట్లుగా పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 31 వరకు జరిగే ఓదార్పు యాత్రలో జనగ్ 36 కుటుంబాలను ఓదారుస్తారు. ఈ సమయంలో ఎవరూ హస్తానికి హాండ్ ఇవ్వకుండా, సైకిల్ దిగకుండా ఏ పార్టీకి ఆ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా కాంగ్రెసు, టిడిపిలు జగన్ను నమ్మి వెళ్లే వాళ్లకు రాజకీయ సమాధి తప్పదని హెచ్చరిస్తున్నారు.