తవ్విన కొద్ది బయటపడుతున్న 'జగన్' లింకులు?
సిబిఐ అధికారుల విచారణతో జగన్ ప్రతినిధులు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. జగన్ కంపెనీలలోకి ఆర్థిక మూలాలు ఎక్కడి నుండి వచ్చాయి. కార్మెలుకు జగతికి సంబంధం ఏమిటి, ఏ ప్రాతిపాదికన పెట్టుబడులు పెట్టిన కంపెనీలకు షేర్లు కేటాయించారు. నగదు బదిలీలు ఎలా జరిగాయి. తదితర విషయాలపై జగతి డైరెక్టర్ ను మొదటి రోజు 8 గంటల పాటు, ఆడిటర్ ను 6 గంటల పాటు విచారించింది. దాదాపు 15 కంపెనీలను ఇప్పటి వరకు సిబిఐ విచారణ జరిపింది. ల్యాంకో అనుబంధ సంస్థ లార్స్ కో, జూబ్లీ వెంచర్స్, పెన్నా తదితర కంపెనీలను విచారించాయి. వారిని పెట్టుబడులపై గుచ్చిగుచ్చి ప్రశ్నించారు. జగతిలో పెట్టుబడులు పెట్టిన వారికి పెట్టుబడులు పెట్టే స్థాయి ఉందా అని పరిశీలిస్తోంది. లేదా ఇతర మార్గాల ద్వారా లాభాలు పొంది పెట్టుబడులు పెట్టారా అనే విషయంపైనా విచారణ జరుపుతోంది.
జగన్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టిన వివిధ కంపెనీల నుండి పూర్తి డాక్యుమెంట్లు తీసుకున్నారు. పెట్టుబడులకు డబ్బులు ఎక్కడి నుండి తరలించారు అనే కోణంలోనూ విచారిస్తున్నారు. భూకేటాయింపుల ద్వారా లబ్ది పొంది జగన్ కంపెనీలలో పెట్టుపడులు పెట్టారా అనే కోణంలోనూ విచారిస్తున్నారు. అందుకోసం పరిశ్రమలు, భూగర్భ గనులు తదితర కార్యాలయాల నుండి కీలక డాక్యుమెంట్లు తెప్పించుకొని పరిశీలిస్తున్నారు. ఏపిఐఐసి నుండి సైతం డాక్యుమెంట్లు తెప్పించుకొని భూకేటాయింపులలో అక్రమాలను పరిశీలిస్తున్నారు. మనీలాండరింగ్ ఏమైనా జరిగిందా అని చూస్తున్నారు. ఆయా కార్యాలయాలలో సంతకాలు చేసిన అధికారులను సైతం విచారించేందకు సిబిఐ ముందుకు వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల నుండి పెట్టుబడులు పెట్టిన కంపెనీలపైనా దృష్టి సారించింది.
కోలకత్తాకు చెందిన రెండు కంపెనీలు 50 కోట్లు పెట్టుబడులు పెట్టాయి. లాభాలు వచ్చే అనేక కంపెనీలు ఉండగా జగన్ కంపెనీలలో ఎందుకు పెట్టుబడులు పెట్టారని ప్రశ్నించారు. భారతి, జగతి, ఇందిరా టెలివిజన్లలోకి భారీ పెట్టుబడులు రావడంతో వాటిపైనే సిబిఐ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీలకు కేటాయించిన భూములను ఆయా కంపెనీలు సద్వినియోగం చేసుకుంటున్నాయా లేదా ఎవరికైనా కట్టబెట్టారా అనే కోణంలోనూ దర్యాఫ్తు చేస్తున్నారు. పెట్టుబడులు పెట్టిన వ్యవధికి కంపెనీలు పొందిన ప్రయోజనానికి మధ్య వ్యవధికి కూడా పరిశీలిస్తున్నారు. మొత్తానికి జగన్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టిన కంపెనీల ఆర్థిక మూలాలను సిబిఐ అధికారులు పూర్తిగా శోధిస్తున్నారు. అయితే తవ్విన కొద్ది కొత్తవి బయటపడుతుండటం విశేషం.