వైయస్ జగన్ వర్గం వాదనలపై ధ్వజమెత్తిన నేతలు
జగన్ను అరెస్టు చేసి విచారణ చేపట్టాలని మంత్రి శంకర్ రావు డిమాండ్ చేశారు. జగన్ సాక్ష్యాధారాలు తారుమారు చేసే అవకాశం ఉందని ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. సాక్ష్యాలు తారుమారు చేసినా ఫలితం ఉండదని అన్నారు. జగన్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టిన అందరిపైనా విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తనను జోకర్ అన్న వారు ఇప్పుడు బాధపడుతున్నారని అన్నారు. ఎమ్మార్లో ఫ్లాట్లు కొన్న వారి పైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వోక్స్ వ్యాగన్ కుంభకోణంపై మళ్లీ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. జగన్ సిబిఐ విచారణకు సహకరించి తన సచ్ఛీలత నిరూపించుకోవాలని మంత్రి శైలజానాథ్ డిమాండ్ చేశారు. కక్ష కట్టే చరిత్ర కాంగ్రెసుకు లేదని కాంగ్రెసు శాసనసభ్యుడు గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు.
రాజకీయ లబ్ధి కోసం వైయస్సార్సీ పార్టీ నేతలు రోడ్లపై బరితెగించి మాట్లాడటాన్ని ఖండిస్తున్నట్లు కాంగ్రెసు పార్టీ చీఫ్ విప్ కొండ్రు మురళి అన్నారు. అవినీతి అంతమొందించడానికే కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాజా, కనిమొళి, సురేష్ కల్మాడి తదితరులపై అవినీతి అభియోగాలు వచ్చినప్పుడు వారిపై కేంద్రం చర్యలు తీసుకుందన్నారు. కాంగ్రెసు ఉద్దేశ్య పూర్వకంగా ఎవరినీ వేధించడం లేదన్నారు. శంకర్ రావు కేసు వ్యక్తిగతం అన్నారు. తన పైనే విచారణ చేయించుకోమని లోకాయుక్తకు శంకర్ రావు లేఖ రాశారన్నారు. వైయస్పై మాకు గౌరవం ఉందన్నారు. సిబిఐ దర్యాఫ్తు ఆలస్యం కావడం వల్ల అక్రమార్కులు తమ జాగ్రత్తలు తాము తీసుకొని ఉంటారని టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అభిప్రాయపడ్డారు. జగన్తో పాటు వైయస్ మంత్రివర్గం, కేంద్ర మంత్రి అహ్మద్ పటేల్ను విచారించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా జగన్ తన ఆస్తుల వివరాలు బయట పెట్టాలన్నారు.