తెలంగాణలో కాంగ్రెసు లీడ్, కెసిఆర్ దూకుడికి చెక్

నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్)లో చేరిన కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పరామర్శల వెల్లువ సాగుతోంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆమరణ నిరాహార దీక్షకు పోటీగానే నిరవధిక నిరాహార దీక్షలు చేపడుతున్నారనే విమర్శలు రావడంతో తెరాస శాసనసభ్యులు వెనక్కి తగ్గారు. ఈ నెల 1వ తేదీ నుంచి తలపెట్టిన నిరవధిక నిరాహారదీక్షలను వారు వాయిదా వేసుకున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిరాహార దీక్షతో దృష్టి అంతా అటు వైపు మళ్లింది. తెరాస శాసనసభ్యులతో పాటు, తెరాసకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు ఎదుర్కుంటున్న తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ కూడా కోమటిరెడ్డి దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించాల్సి వచ్చింది. నిమ్స్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అన్ని పార్టీల తెలంగాణ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు పరామర్శిస్తున్నారు. ప్రాంతాలకు అతీతంగా కాంగ్రెసు పార్ట నాయకులు పరామర్శిస్తున్నారు.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిరాహార దీక్ష ద్వారా పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకోవాలని కాంగ్రెసు పార్టీ నాయకత్వం భావిస్తోంది. అందుకు అనుగుణంగానే వ్యవహరిస్తోంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి దీక్షకు తలొగ్గి కేంద్ర ప్రభుత్వం గానీ కాంగ్రెసు అధిష్టానం గానీ ప్రకనట చేస్తుందని కూడా ఎవరూ అనుకోవడం లేదు. ఏ క్షణంలోనైనా తెలంగాణపై ప్రకటన వస్తుందని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెప్పినా విశ్వాసం కలగడం లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి దీక్షకు ఎలా తెర దించుతారనే విషయాన్ని పక్కన పెడితే కెసిఆర్పై పైచేయి సాధించడానికి మాత్రం కాంగ్రెసు వేసిన ఎత్తులు కొంత మేరకు ఫలించినట్లే భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications