వెన్ను నొప్పికి చికిత్స చేయించండి: కోనేరు ప్రసాద్
దుబాయ్ ప్రసాద్గా పేరు సంపాదించుకున్న కోనేరు ప్రసాద్ ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేశాడనేది ఆసక్తికరమైన విషయమే. ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో తొలి అరెస్టు కోనేరు ప్రసాద్దే కావడం కూడా ఆ ఆసక్తిని మరింత పెంచింది. ఆయన జీవితం ఎన్నో మలుపులు తిరిగింది. అయితే, అకస్మాత్తుగా సిబిఐ అరెస్టుతో అతనికి చేదు గుళిక మింగినట్లయింది. కృష్ణా జిల్లాకు చెందన కోనేరు ప్రసాద్ తన జీవితాన్ని అతి సాధారణంగా ప్రారంభంచాడు. చాలా యేళ్ల క్రితం అతను ఓ మైనింగ్ కంపెనీలో ఉద్యోగిగా చేరాడు. కొద్ది కాలంలోనే భారతేదశంలోనే కాకుండా పశ్చిమాసియాలో, ముఖ్యంగా దుబాయ్లో ప్రధానమైన వ్యక్తిగా మారిపోయారు. అతనికిప్పుడు మైనింగ్ కంపెనీలున్నాయి. రియల్ ఎస్టేట్లో భారీ పెట్టుబడులు పెట్టాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని చెన్నై నుంచి నిర్వహిస్తున్నాడు.
కోనేరు ప్రసాద్ అయ్యప్ప భక్తుడు. గత 28 ఏళ్లుగా మాల వేసుకుంటున్న అతనికి గురుస్వామి హోదా కూడా లభించింది. ప్రస్తుతం సిబిఐ అరెస్టు చేసిన సమయంలో కూడా అతను అయ్యప్ప దీక్షలో ఉన్నాడు. అతనికి గోల్ఫ్ అంటే అమితమైన ప్రేమ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గోల్ఫ్ క్లబ్బుల్లో అతను గోల్ఫ్ ఆడుతుంటాడు, ప్రముఖులకు విందులు ఇస్తుంటాడు. కోనేరు ప్రసాద్కు విపరీతమైన చొరవ ఉంది. దాంతో దుబాయ్ ప్రభుత్వంలోనివారితో కూడా సంబంధాలు ఏర్పడ్డాయని అంటారు. దీనివల్లనే అతను అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి దృష్టిలో పడినట్లు చెబుతారు. దానివల్లనే హైదరాబాదు నగరంలో మెగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్, గోల్ఫ్ కోర్స్, ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ ప్రాజెక్టులకు యోచన ముందుకు వచ్చినట్లు చెబుతారు.
ముఖ్యమంత్రులు మారినా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో కోనేరు ప్రసాద్ సన్నిహిత సంబంధాల్లో తేడా రాలేదని చెబుతారు. చంద్రబాబుకు గతంలో అత్యంత సన్నిహితుడైన కోనేరు ప్రసాద్ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డితో, కెవిపి రామచందర్ రావుతో కూడా అంతే సన్నిహిత సంబంధాలను నెరిపిన విషయం అందరికీ తెలుసునని అంటారు. ఎమ్మార్ ప్రాపర్టీస్లోని విల్లాలను, విల్లా స్థలాలను, అపార్టుమెంట్లను స్టైలిష్ హోమ్స్ ద్వారా అధిక ధరలకు విక్రయించడమే ప్రసాద్ కొంప ముంచిందని అంటున్నారు. ఎపిఐఐసితో ఒప్పందం కుదుర్చుకున్న ఎమ్మార్ ప్రాపర్టీస్లో డైరెక్టర్గా ఉంటూ కోనేరు ప్రసాద్ స్టైలిష్ హోమ్స్ను నెలకొల్పి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఎమ్మార్ ప్రాపర్టీస్లో రాజకీయ, సినీ ప్రముఖులకు విల్లాలు, విల్లా ప్లాట్లు అతను విక్రయించాడు. కోనేరు ప్రసాద్ ట్రైమెక్స్ గ్రూప్ సంస్థను కూడా స్థాపించాడు.