జూ ఎన్టీఆర్ సహా ఎవరినీ దూరం చేసుకోం: చంద్రబాబు
సమస్యలొస్తే వారితో కూడా మాట్లాడుతానని, హరికృష్ణ కావచ్చు.. జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు.. మరొకరు కావచ్చు... ఎవరినీ దూరం చేసుకునే పరిస్థితి ఉండదని, పార్టీని కాపాడుకోవడం కూడా ముఖ్యమైన విషయమేనని ఆయన అన్నారు. బాలయ్య, చిరంజీవి మధ్య మాటల యుద్ధం గురించి ప్రశ్నించగా - తాము వ్యక్తిగతంగా ఎవరి మీదకు వెళ్లబోమని, సిద్ధాంతాలపరంగా పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. టీడీపీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని, తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇతరులు కుల, మతాలను వాడుకుంటున్నారని, కానీ టీడీపీ ఎప్పుడూ అలా చేయదని, సమతుల్యత పాటిస్తుందని అన్నారు. చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్లో కలిపేశారని, చిరంజీవి పార్టీలోకి వెళ్ళి.. అటు నుంచి కాంగ్రెస్లోకి వెళ్లిన టీడీపీ వారిని వెనక్కి వచ్చేయాలని కోరుతున్నామని, అద్దె ఇల్లు కంటే ఎప్పుడైనా సొంతిల్లే హాయిని, సంతోషాన్ని ఇస్తుందని, పార్టీ వల్ల అలా వెళ్ళిపోయిన వారికి ఎప్పుడైనా అన్యాయం జరిగి ఉంటే వాటిని సరిదిద్దుతామని కూడా చెబుతున్నామని ఆయన అన్నారు.
వైయస్ జగన్ తన మీద వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పకుండా మీడియా, న్యాయవ్యవస్థ, ప్రతిపక్షాలపై ఎదురుదాడికి దిగుతున్నారని, 2004 నుంచి తాను ఫలానా వ్యాపారాలు చేసి అంత డబ్బును సంపాదించానని తన దగ్గరున్న ఆధారాలను బయటపెట్టమనండని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీతో అనేక పార్టీలు జతకట్టాయని, కానీ టీడీపీ మాత్రం ఎప్పుడూ ఆ పార్టీకి దూరంగానే ఉందని, వైఎస్సార్ కాంగ్రెస్ కూడా ఆ పార్టీ తానులో నుంచి వచ్చిందే కదా అని, జగన్కు తమను విమర్శించే అర్హత ఎక్కడ ఉందని ఆయన అన్నారు.