మహిళలకు ఉచితబస్సులతో ఆర్టీసీకి ఎంత ప్రాఫిట్ వచ్చిందో తెలుసా!
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీజీఎస్ఆర్టీసీ చరిత్ర సృష్టించింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించి చరిత్రలోనే అత్యధిక లాభాలను సాధించి కొత్త రికార్డు సృష్టించింది. గత పదేళ్లుగా నష్టాల్లో కొట్టుమిట్టాడిన ఆర్టీసీ ఇప్పుడు ఏకంగా వెయ్యి కోట్లకు పైగా లాభాలను గడించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.1,059.02 కోట్ల భారీ ప్రాఫిట్ ను నమోదు చేసింది.
మహాలక్ష్మి పథకంతో పెరిగిన బస్సుల రద్దీ
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే మహాలక్ష్మి పథకం ఈ విజయానికి ప్రధాన కారణమని అధికారులు వెల్లడించారు. మహాలక్ష్మి పథకం అమలు చేయడంతో బస్సుల్లో ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా మహిళా ప్రయాణికులు ఎక్కువగా ప్రయాణాలు చేయటంతో బస్సుల్లో గతం కంటే ఆక్యుపెన్సీ పెరిగింది. గతంలో బస్సుల ఆక్యుపెన్సీ రేషియో 67 శాతంగా ఉండగా, ప్రస్తుతం అది 98 శాతానికి చేరుకుంది.

ఈ ఏడాది ఆర్టీసీ ఆదాయం, లాభాల లక్ష్యం ఇదే
ఇందుకు తోడు ప్రయాణికుల ఛార్జీలలో చేసిన వ్యూహాత్మక సవరణలు, టోల్ ఛార్జీలు, సేఫ్టీ సెస్ మరియు రౌండ్-అప్ ఛార్జీల సవరణలు సంస్థ ఆదాయాన్ని మరింత పెంచాయి. ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయడం కూడా ఆర్టీసీ ప్రగతికి, ఆర్టీసీ ఆదాయ వృద్ధికి కీలక పాత్ర పోషించింది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో టీజీఎస్ఆర్టీసీ రూ.9,639.5 కోట్ల ఆదాయం, రూ.1,118.8 కోట్ల లాభాలను లక్ష్యంగా పెట్టుకుంది.
క్రమంగా పెరుగుతూ వస్తున్న ఆర్టీసీ ఆదాయం
గత దశాబ్దంలో సంస్థ ఆదాయం గణనీయంగా పెరిగింది. 2014-15లో రూ.3,294 కోట్లుగా ఉన్న ఆదాయం 2025-26 నాటికి రూ.9,374 కోట్లకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి మాట్లాడుతూ, మహాలక్ష్మి పథకం సంస్థ పునరుజ్జీవనానికి బలం అందించిందని తెలిపారు. ఈ విజయం ఆర్టీసీ స్వయం సమృద్ధి వైపు అడుగులు వేస్తున్నట్లు సూచిస్తోందని తెలిపారు.
ఆర్టీసీకి ఊపిరి పోసిన మహాలక్ష్మీ పథకం
ప్రభుత్వ సహాయంపై ఆధారపడిన సంస్థ ఇప్పుడు లాభాల బాటలో నడుస్తోంది. మరిన్ని సేవలు, కొత్త బస్సులు, మెరుగైన సౌకర్యాలతో రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి సాధించాలని ఆర్టీసీ భావిస్తోంది. మహాలక్ష్మి పథకం తెలంగాణ రవాణా రంగానికి కొత్త ఊపిరి పోసింది. ఈ క్రమంలో ఆర్టీసీ తీసుకుంటున్న కొత్త నిర్ణయాలు కూడా ఆర్టీసీ లాభాలకు కారణమైంది.














Click it and Unblock the Notifications