తిరుచానూరు ఆలయంలో వరలక్ష్మీవ్రతం- మహిళలకు టీటీడీ కానుక
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ నెల 21వ తేదీన వరలక్ష్మీ వ్రతం వైభవంగా జరుగనుంది. శుక్రవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆస్థానమండపంలో వరలక్ష్మీ వ్రతం ఆగమోక్తంగా నిర్వహించనున్నారు అర్చకులు. సాయంత్రం 6 గంటలకు శ్రీ పద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. వేలాదిమంది భక్తులు ఈ వ్రతంలో పాల్గొనే అవకాశం ఉండటంతో టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది.
స్కంద, భవిష్యోత్తర పురాణాల ప్రకారం పరమశివుడు పార్వతీదేవికి వరలక్ష్మీ వ్రత విశిష్టత, ఆచరించే విధానాన్ని వివరించినట్లు అర్చకులు తెలిపారు. శ్రీ మహాలక్ష్మీ అవతరించిన దివ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన తిరుచానూరులో వరలక్ష్మీ వ్రతానికి విశేష ప్రాశస్త్యం ఉంది. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీ. భక్తిశ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించే మహిళలకు సత్సంతానం, దీర్ఘ సుమంగళీ సౌభాగ్యం, ఐశ్వర్యం, ఆరోగ్యం, కుటుంబ సౌఖ్యం కలుగుతాయని విశ్వసిస్తారు.

వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఈ నెల 13వ తేదీన ఉదయం 10 గం.లకు ఆన్ లైన్ లో టికెట్లను విడుదల చేయనున్నారు. ఆఫ్ లైన్ టికెట్లను ఒక రోజు ముందు ఆలయం సమీపంలో గల కౌంటర్ లో అందుబాటులో ఉంటాయి. ఈ క్రమంలో టీటీడీ జేఈవో డాక్టర్ శరత్ ఆలయంలో పర్యటించారు. ఏర్పాట్లను పర్యవేక్షించారు. తిరుచానూరులోని ఆస్థానమండపంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానితో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆదేశాలు ఇచ్చారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దర్శనం, క్యూలైన్లు, తాగునీరు, మజ్జిగ, అన్నప్రసాదం, పారిశుద్ధ్యం, భద్రత తదితర ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని అన్నారు. వ్రతం సందర్భంగా అభిషేకం, అభిషేకానంతర దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, బ్రేక్ దర్శనం, ఊంజల్సేవలను రద్దు చేసినట్లు తెలిపారు. మహిళా భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున క్యూలైన్లు, పందిర్లు, సూచిక బోర్డులు, ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని జేఈవో ఆదేశించారు. మహిళలకు కానుకగా అందించడానికి కుంకుమ ప్యాకెట్లు, కంకణాలు, గాజులు సిద్ధం చేయాలని చెప్పారు.
భక్తుల్లో ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించేలా భజన బృందాలను ఏర్పాటు చేయాలని, ఆలయం, ఆస్థానమండపం పరిసరాలను పుష్పాలు, విద్యుద్దీపాలతో ఆకర్షణీయంగా అలంకరించాలని సూచించారు. శ్రీవారి సేవకులు, పారిశుద్ధ్య, భద్రతా సిబ్బందిని సమకూర్చుకోవాలని, ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా పోలీసు, స్థానిక పంచాయతీ అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. వరలక్ష్మీ వ్రతాన్ని ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని అన్నారు.














Click it and Unblock the Notifications