అరుణాచల్ ప్రదేశ్ లోకి చెనా సైన్యం.. ఇండియన్ ఆర్మీ కీలక ప్రకటన
అరుణాచల్ ప్రదేశ్ లోని భారత భూభాగంలోకి చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) చొరబడి కొత్తగా సైనిక శిబిరాలను ఏర్పాటు చేసిందంటూ వస్తున్న కథనాలను భారత సైన్యం తీవ్రంగా ఖండించింది. ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది. చైనా బలగాల చొరబాట్లకు సంబంధించి వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమైనవని, సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని ఆర్మీ తేల్చిచెప్పింది.
అరుణాచల్ ప్రదేశ్ లోని ఎగువ సుబన్ సిరి జిల్లా తక్సింగ్ ప్రాంతానికి చెందిన 'నాహ్ వెల్ఫేర్ సొసైటీ' (ఎన్డబ్ల్యూఎస్) అనే స్థానిక సామాజిక సంస్థ జిల్లా యంత్రాంగానికి సమర్పించిన మెమొరాండం ఆధారంగా ఈ వార్తలు వెలుగులోకి వచ్చాయి. గత కొన్ని దశాబ్దాలుగా చైనా సైన్యం సరిహద్దు ప్రాంతాల్లో క్రమంగా తన ఉనికిని విస్తరిస్తోందని, స్థానిక ప్రజలు పశువుల మేత కోసం, అటవీ ఉత్పత్తుల సేకరణ కోసం ఉపయోగించే సాంప్రదాయ ప్రాంతాలను ఆక్రమించుకుంటోందని ఆ సంస్థ ఆరోపించింది.
ముఖ్యంగా ఓయింగ్, చూజార్తా పరిధిలోని పానియర్, మార్పన్, పోట్రాంగ్ సరస్సు, టిండింగ్తాంగ్ వంటి ఐదు కీలక సరిహద్దు ప్రాంతాలలో చైనా సైన్యం 2020 నుంచి రహదారులు, వంతెనల నిర్మాణంతో పాటు సైనిక స్థావరాలను అభివృద్ధి చేస్తోందని స్థానిక సంస్థ పేర్కొంది. అయితే, చొరబాట్లకు సంబంధించి వస్తున్న వార్తలను తోసిపుచ్చిన భారత సైన్యం, సరిహద్దు వెంబడి ఎటువంటి చట్టవిరుద్ధ నిర్మాణాలు జరగలేదని స్పష్టం చేసింది. దేశ సరిహద్దులను విజయవంతంగా కాపాడుతున్నామని తెలిపింది.
భారత్, చైనాల మధ్య బీజింగ్లో జరిగిన సరిహద్దు వ్యవహారాల సంప్రదింపుల సమన్వయ కమిటీ (WMCC) 35వ సమావేశం ముగిసిన కొద్ది రోజులకే ఈ ఆరోపణలు తెరపైకి రావడం గమనార్హం. ఈ దౌత్యపరమైన చర్చల్లో సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పడంతో పాటు ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణపై ఇరు దేశాల ప్రతినిధులు సానుకూలంగా చర్చలు జరిపారు. ఉద్రిక్తతలను తగ్గించి, సరిహద్దుల వెంబడి శాంతిభద్రతలను పర్యవేక్షించేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి.

సరిహద్దు భద్రతపై స్థానిక ప్రజలు వ్యక్తం చేస్తున్న ఆందోళనలను పరిగణనలోకి తీసుకుంటూనే, ఎల్ఏసీ వెంబడి భారత సైన్యం అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోందని అధికారులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ కదలికలనైనా సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు వీలుగా సరిహద్దు వెంబడి నిరంతర నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేశామని, దేశ ప్రాంతీయ సమగ్రతను రక్షించడానికి సైన్యం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications