ఇంట్లో నుండే మహిళలకు ఆదాయం వచ్చేలా కొత్త పథకం.. వందశాతం సబ్సిడీ!
తెలంగాణా సర్కార్ మహిళల ఆర్ధిక స్వావలంబనకు అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం బీసీ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం కొత్త పథకాన్ని ప్రారంభించింది. 'ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు' పేరుతో కొత్త పథకం ద్వారా మహిళల ఆర్ధిక స్వావలంబనకు దోహదం చేయనుంది. ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం ద్వారా మహిళలు ఇంటి నుంచే ఆదాయం సంపాదించుకునే అవకాశం కలుగుతుంది.
ఇంటింటా కుట్టు మిషన్ లు.. వంద శాతం సబ్సిడీ స్కీమ్
రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నేడు సచివాలయంలో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం కింద రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి వెయ్యి చొప్పున మొత్తం 1.19 లక్షల ఆటోమేటిక్ కుట్టు మిషన్లు పంపిణీ చేయనున్నారు. ఒక్కో కుట్టు మిషన్ విలువ రూ.12వేలుగా ఉంది. లబ్ధిదారులపై ఎటువంటి ఆర్థిక భారం లేకుండా 100 శాతం సబ్సిడీపై ఈ కుట్టు మిషన్లను అందజేస్తారు.

ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు దరఖాస్తులు చేసుకునే అవకాశం
ఈ స్కీమ్ ద్వారా లబ్ది పొందాలనుకునే బీసీ మహిళలు ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు .కుట్టు వృత్తిపై ఆసక్తి ఉన్న నిరుద్యోగ బీసీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఇకా పథకం వర్తింపులో అత్యంత పేదలు, వితంతువులు, ఒంటరి మహిళలు, నిరాశ్రయులు, అనాథలు, వికలాంగులు, అలాగే కుట్టు పనిలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు.
మహిళా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని లక్ష్యంతోనే ఈ స్కీమ్: మంత్రి పొన్నం
లబ్ధిదారుల ఎంపిక పూర్తిగా పారదర్శకంగా, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జరుగుతుంది. కుట్టు మిషన్ల ద్వారా ఆదాయం సంపాదించేలా వారికి అవసరమైన శిక్షణను కూడా అందిస్తారు.
ఇక ఈ పథకంపై మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం బీసీ మహిళలను కేవలం లబ్ధిదారులుగా కాకుండా స్వయం ఉపాధి పొందే మహిళా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు.
బీసీ మహిళలకు ప్రయోజనం చేకూర్చే దిశగా ప్రభుత్వం చర్యలు
ఇంటి నుంచే కుట్టు పని చేసుకుని ఆదాయం పొందే అవకాశం కల్పించడం ద్వారా మహిళల ఆర్థిక సాధికారత పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. మొదటి దశలో 1.19 లక్షల మందికి అవకాశం కల్పించినా, భవిష్యత్తులో పథకాన్ని మరింత విస్తరించి ఎక్కువ మంది బీసీ మహిళలకు ప్రయోజనం చేకూర్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చెయ్యాలని సంకల్పించిన తెలంగాణా సర్కార్ ఈ దిశగా తాజా నిర్ణయం తీసుకుంది. మహిళా సాధికారత దిశగా మహిళలకు మద్దతు అందిస్తుంది.












Click it and Unblock the Notifications