చిమ్మ చీకట్లో బంగ్లాదేశ్..! షాపుల మూసివేత..! భారత్ వైపు చూపు..!
బంగ్లాదేశ్ (Bangladesh) ను కారు చీకట్లు కమ్మేస్తున్నాయి. దేశమంతా విద్యుత్ కోతలతో (Power Crisis) అల్లాడుతోంది. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో గంటల తరబడి విద్యుత్ నిలిపేస్తున్నారు. విద్యుత్ ను ఆదా చేసేందుకు ప్రభుత్వం షాపులు, మాల్స్ ను రాత్రి 8 గంటలకే మూసేయాలని ఆదేశాలు ఇచ్చింది. విద్యుత్ కోతలపై మండిపడుతున్న జనం.. విద్యుత్ కేంద్రాలపై దాడులకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ పొరుగున ఉన్న భారత్ సాయం కోరుతోంది.
బంగ్లాదేశ్ రాజధాని ఢాకా చుట్టూ ఉన్న గ్రామాల్లో విద్యుత్ కొరత తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతీ రోజూ ఇక్కడ 8-10 గంటల పాటు విద్యుత్ కోతలు ఉంటున్నాయి. దేశంలో విద్యుత్ డిమాండ్ సుమారు 18వేల మెగావాట్లుగా ఉండగా, సరఫరా 13వేల మెగావాట్లకు కూడా చేరుకోలేకపోతోంది. దీనికి ఉక్కపోత, వేడిమి తోడై అల్లాడుతున్న జనం.. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ కేంద్రాలపై దాడి చేస్తున్నారు. ప్రభుత్వం అన్ని షాపింగ్ మాల్స్, మార్కెట్లు, దుకాణాలను రాత్రి 8 గంటలలోపు మూసివేయాలని ఆదేశించింది. దేశవ్యాప్తంగా అన్ని వాణిజ్య ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు రాత్రి 8 గంటలలోపు ముగించాలని కోరింది. అలంకరణ దీపాలను నిషేధించారు. అన్ని విద్యుత్ బిల్ బోర్డులను రాత్రి 7 గంటలలోపు ఆపేయాలని కూడా ఆదేశాలు ఇచ్చారు. ఆసుపత్రులు, ఫార్మసీలకు మాత్రం మినహాయింపు ఇట్చారు.

ఈ పరిస్థితికి ప్రధాన కారణం ఇంధనం, గ్యాస్ కొరత. బంగ్లాదేశ్ తన చమురులో 90 శాతం పైగా, గ్యాస్లో 30 శాతం దిగుమతి చేసుకుంటుంది. గత నెలలో అమెరికా కంపెనీ ఎక్సెలరేట్ ఎనర్జీకి చెందిన ఒక టెర్మినల్లో అగ్నిప్రమాదం తర్వాత LNG సరఫరా సగానికి పడిపోయింది. జూలై 21 తర్వాత ఆ టెర్మినల్ మూసేసిన ఈ టెర్మినల్.. తిరిగి ఈ వారం ప్రారంభంలోనే పాక్షికంగా ప్రారంభమైంది. అలాగే సముద్రంలో వాతావరణం అనుకూలించకపోవడం వల్ల కనీసం రెండు ఎల్ఎన్జి నౌకలు టెర్మినల్స్లో సరుకును దించలేకపోయాయి. అలాగే దిగుమతి చేసుకున్న విద్యుత్ సరఫరా కూడా తగ్గడంతో విద్యుత్ కోతలు పెరిగాయి. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ అదనపు డీజిల్ సరఫరా చేయాలని భారత్ను కోరింది. భారత్-బంగ్లా పైప్ లైన్ ద్వారా దీన్ని సరఫరా చేస్తారు.














Click it and Unblock the Notifications