రంగారావుకు బెయిల్: ప్రత్యేక ఖైదీగా సునీల్ రెడ్డి
రూ. 25వేల చొప్పున రెండు పూచీకత్తులతో సిబిఐ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. తమ అనుమతి లేకుండా హైదరాబాదు విడిచి వెళ్లరాదని కోర్టు రంగారావును ఆదేశించింది. సిబిఐ దర్యాప్తునకు సహకరించాలని సూచించింది. ఈ నెల 6వ తేదీన కోర్టులో హాజరు కావాలని కూడా ఆదేశించింది. రంగారావు బెయిల్ పిటిషన్ను సిబిఐ వ్యతిరేకించకపోవడం గమనార్హం. ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో సిబిఐ ఇప్పటి వరకు నలుగురిని అరెస్టు చేసింది. రంగారావును మాత్రం అరెస్టు చేయలేదు. ఆయనను అరెస్టు చేయకపోవడంపై వైయస్ జగన్ నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు నేతలు సిబిఐని తప్పు పడుతున్నారు కూడా. కాగా, వైయస్ జగన్ ఆస్తుల కేసులో ఐఎఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా బుధవారం సిబిఐ ముందు హాజరయ్యారు.
ఇదిలా వుంటే, ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో అరెస్టయిన సునీల్ రెడ్డిని ప్రత్యేక హోదా గల ఖైదీగా గుర్తిస్తూ కోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో విజయసాయి రెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి, తదితరులతో పాటు సునీల్ రెడ్డికి చంచల్గుడా జైలులో ప్రత్యేక వసతులు సమకూరుతాయి.