ఆ భూములలో పరిశ్రమలేవి?: జగన్కు దూళిపాళ్ల ప్రశ్న
జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో సిబిఐ ఛార్జీషీట్ బలహీనంగా ఉందని ఆయన విమర్శించారు. కాంగ్రెసుతో జగన్ ఒప్పందం వల్లే ఛార్జీషీట్ బలహీనంగా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయని ఆయన అన్నారు. కాగా ఆదివారం సాయంత్రం టిడిపి నేత రేవంత్ రెడ్డి కూడా హైదరాబాదులో జగన్మోహన్ రెడ్డి, కాంగ్రెసుపై ఇదే అంశంపై ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. జగన్మోహన్ ఆస్తుల కేసులో సిబిఐ దర్యాఫ్తు మహేష్ బాబు దూకుడులా పోతుందనుకుంటే వేణుమాదవ్లా జావగారిపోతుందని విమర్శించారు. జగన్ తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి అధికారాన్ని అడ్డు పెట్టుకొని లక్ష కోట్లు సంపాదించారని ఆరోపించారు.
జగన్ లక్ష కోట్లు సంపాదించారని అందరూ అంటుంటే సిబిఐ మాత్రం కేవలం రూ.ముప్పై వేల కోట్లు అంటూ ఛార్జీషీట్ దాఖలు చేసిందని విమర్శించారు. ఛార్జీషీట్లో పొందుపర్చిన జగన్ ఆస్తులు చూసి ఆ పార్టీయే ఆశ్చర్య పోతోందన్నారు. జగన్ ఆస్తుల కేసులో జివోలు జారీ చేసిన మంత్రులను కూడా విచారించాలని ఆయన డిమాండ్ చేశారు. సిబిఐ ఛార్జీషీట్ కోర్టు ధిక్కారం అవుతుందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత సోమయాజులు చెబుతున్నారని, ఎలా కోర్టు ధిక్కారమవుతుందో ఆయన చెప్పాలన్నారు. ఇప్పటి వరకు మనం మతోన్మాదులను తదితరులను చూశామని, కానీ జగన్ మాత్రం ఆర్థిక ఉన్మాది అని మండిపడ్డారు.
జగన్ ఆక్రమాస్తులపై ఎవరైనా మాట్లాడితే ఆయన వర్గం ఎదురు దాడి చేస్తుందని ఆరోపించారు. ఆయన మీడియా ఎదురు దాడి చేస్తుందన్నారు. అధికారం అఢ్డు పెట్టుకొని లక్ష కోట్లు సంపాదించిన జగన్ నీతివంత పాలన ఇస్తానని అంటే ఎవరైనా నమ్ముతారా అని ప్రశ్నించారు. అక్రమాలకు పాల్పడేందుకు తాను సచివాలయానికి రాలేదని, అధికారులకు ఫోన్ చేయలేదని జగన్ చెబుతున్నారని అంటే ఆయన తన తండ్రి అధికారంలో ఉండి అక్రమాలకు పాల్పడ్డారని ఒప్పుకున్నట్లేనని అన్నారు. జగన్ వితండ వాదం మానాలన్నారు. వైయస్ హయాంలో పరిపాలన ఎక్కడి నుండి జరిగిందో అందరికి తెలుసున్నారు. మాజీ మంత్రి పరిటాల రవీంద్ర హత్య కేసులో సిబిఐ జగన్ను ఆయన ఇంట్లో విచారించిందా లేక మరోచోట వివరించిందా ఆయన స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.