మాజీ మంత్రి ముద్దసాని దామోదర రెడ్డి మృతి
ముద్దసాని దామోదర రెడ్డి నాలుగుసార్లు శాసనసభ్యుడిగా పని చేశారు. కరీంనగర్ జిల్లా కమలాపూర్ నుండి ఆయన ఈ నాలుగుసార్లు ప్రాతినిథ్యం వహించారు. ఆయన సొంత గ్రామం కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మామిడాలపల్లి గ్రామం. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన మూడుసార్లు మంత్రిగా పని చేశారు.
యువజన వ్యవహారాలు, పర్యాటక శాఖ, రవాణా శాఖ, సాంకేతిక మంత్రిగా పని చేశారు. ప్రస్తుత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టిడిపి వ్యవస్థాపకులు, స్వర్గీయ నందమూరి తారక రామారావుల హయాంలో ఆయన మంత్రిగా పని చేశారు.
ప్రస్తుతం ఆయన అదే జిల్లాకు చెందిన హుజురాబాద్ నియోజకవర్గానికి ఇంచార్జుగా ఉన్నారు. 1985లో ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఈయనకు భార్య, ఓ కుమారుడు ఉన్నారు. ఆయన మృతి విషయం తెలిసిన పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు సంతాపం తెలియజేశారు. టిడిపి నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పలువురు రాజకీయ నేతలు నివాళులు అర్పించారు.