వైయస్ జగన్ చేతుల్లోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు?

వచ్చే ఉప ఎన్నికల్లో వైయస్ జగన్ ఎక్కువ స్థానాలు గెలిస్తే రాష్ట్ర విభజన తప్పదని అంటున్నారు. తెలంగాణలోనైనా పార్టీని కాపాడుకోవడానికి కాంగ్రెసు అధిష్టానం రాష్ట్ర విభజనకు కాంగ్రెసు పార్టీ నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు. వైయస్ జగన్కు ఓటేస్తే రాష్ట్ర విభజనకు ఓటేసినట్లేనని రాయలసీమకు చెందిన మంత్రి టిజి వెంకటేష్ పదే పదే అంటుండంలోని ఆంతర్యం కూడా అదేనని అంటున్నారు. ఉప ఎన్నికల ఫలితాలు రాష్ట్ర విభజన అంశాన్ని తేలుస్తాయని సమైక్యవాదాన్ని బలపరుస్తున్న విజయవాడ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఓ సందర్భంలో అన్నారు.
వైయస్ జగన్ను కట్టడి చేయడానికి, తెలంగాణ సమస్యను పరిష్కరించడానికి ఉప ఎన్నికల ఫలితాల తర్వాత వ్యూహరచన చేసి కాంగ్రెసు పార్టీ అమలు చేస్తుందని అంటున్నారు. పైగా, అది విలీనం సమయంలో కలిపిన తెలంగాణ ప్రాంతాలతో ఏర్పడే కచ్చితమైన తెలంగాణ రాష్ట్రం కాదని అంటున్నారు. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణతో కలిపి, ఖమ్మం జిల్లాను సీమాంధ్రలో కలిపి రాష్ట్ర విభజన చేసే ఆలోచన ఉందని చెబుతున్నారు.
కడప జిల్లాకు చెందిన వైయస్ జగన్మోహన్ రెడ్డిని సీమాంధ్రలో కట్టడి చేయాలంటే ఆ జిల్లాను తెలంగాణలోకి తేవడం మంచిదని కాంగ్రెసు అధిష్టానం అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే జగన్ తెలంగాణలో బలం పుంజుకోవడం కష్టమని, అదే సమయంలో కడప జిల్లా తెలంగాణలోకి వస్తుండడంతో సీమాంధ్రలో పట్టు కోల్పోతారని అంటున్నారు. అనంతపురం, కర్నూలు జిల్లాలతో కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని అనంతపురం జిల్లాకు చెందిన కాంగ్రెసు శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి అంటూనే ఉన్నారు.
జగన్ కట్టడి చేయాలంటే రాష్ట్ర విభజన చేయాల్సిన పరిస్థితి ఉందని సీమాంధ్రకు చెందిన కాంగ్రెసు నాయకులు అంటున్నారు. జగన్ కట్టడి చేయడానికి వారు రాష్ట్ర విభజనకు అనుకూలంగా మారుతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఉప ఎన్నికల తర్వాత శుభవార్త వింటారని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తెలంగాణ కాంగ్రెసు నాయకులతో అంటున్నట్లు తెలుస్తోంది. పిసిసి అధ్యక్ష పదవిని చేపట్టక ముందు బొత్స సత్యనారాయణ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా ప్రతిస్పందిస్తూ వచ్చారు.












Click it and Unblock the Notifications