వైయస్ తప్పులు చెప్తూనే..: హర్షకుమార్, జగన్పై అలీ
కాంగ్రెసు పార్టీకి దెబ్బతిన్నప్పటికీ కోలుకునే శక్తి ఉందని హర్ష కుమార్ చెప్పారు. రామచంద్రాపురంలో కాంగ్రెసు పార్టీ తప్పకుండా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అక్కడ కాంగ్రెసు అభ్యర్థి గెలుపు బాధ్యత తనదే అని చెప్పారు. వైయస్ చేసిన తప్పులు, కాంగ్రెసు చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకు వెళ్తామన్నారు. వాయలార్ రవి పర్యటన రామచంద్రాపురంలో విజయవంతమైందన్నారు.
ఉప ఎన్నికలు ఎదుర్కొంటూనే తాము 2014 ఎన్నికలకు సమాయత్తమవుతున్నామని చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెసుకు ఉన్న ఓటు బ్యాంకు ఎక్కడకూ పోలేదన్నారు. కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు కాంగ్రెసు వారిగానే ఉన్నారని చెప్పారు. ఉప ఎన్నికలలో తమ పార్టీ మంచి ఫలితాలు సాధిస్తుందని ఆయన చెప్పారు
పార్టీలో సమన్వయం లేదని తాను వాయలార్ రవి దృష్టికి తీసుకు వెళ్లానని దానం నాగేందర్ చెప్పారు. త్వరలోనే పరిస్థితి చక్కబడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రవి చక్కదిద్దేందుకే వచ్చారన్నారు. ఆయన పర్యటన తర్వాత అంతా బాగుంటుందన్నారు. పార్టీ నేతల్లో ఏకాభిప్రాయం లేకపోవడం కాంగ్రెసుకు కొత్త కాదన్నారు.
అయినా భిన్నత్వంలో ఏకత్వం కాంగ్రెసుకే సాధ్యమన్నారు. ఎలాంటి భేదాభిప్రాయాలు ఉన్నా పార్టీ కోసం అందరం అంతిమంగా కష్టపడతామన్నారు. నేతల మధ్య సమన్వయం కుదిర్చితే పార్టీకి ఎలాంటి ఢోకా ఉండదని చెప్పారు. రవి పర్యటన కాంగ్రెసుకు ప్రయోజనం చేకూర్చుతుందని చెప్పారు. మార్పులపై ఉహాగానాలతో ఒరిగేదేం లేదన్నారు. వచ్చే సాధారణ ఎన్నికల తర్వాత కూడా కాంగ్రెసు పార్టీ బలంగానే ఉంటుందని చెప్పారు.
మాజీ మంత్రి షబ్బీర్ అలీ మాట్లాడుతూ ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ వైయస్ పథకంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారని, అది 1994లోనే కోట్ల విజయ భాస్కర రెడ్డి విడుదలైన జివో అని చెప్పారు. తెలంగాణపై ఆలస్యం కాకుండా వెంటనే నిర్ణయం తీసుకోవాలని తాను వాయలార్కు సూచించినట్లు చెప్పారు. తెలంగాణను వ్యతిరేకిస్తున్న మైనార్టీలను పిలిచి మాట్లాడాలని సూచించినట్టు చెప్పారు. పార్టీ పరిస్థితిపై ఢిల్లీలో చర్చిద్దామని చెప్పారని, తాను త్వరలో ఢిల్లీ వెళ్లనున్నట్లు చెప్పారు.